హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల సరుకులు గాలిలో ఎగురుకుంటూ వచ్చి మీ ఇంటి ముంగిట చేరబోతున్నాయి. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే ట్రాఫిక్తో సంబంధం లేకుండా నిమిషాల్లో వస్తువులు డెలివరీ కాబోతున్నాయి. అందుకు ‘మారుత్’ వాయువేగంతో దూసుకు రాబోతున్నది. అవును! ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. ఇన్స్టామార్ట్ గ్రోసరీ డెలివరీ సర్వీస్ కోసం డ్రోన్లను వాడేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన స్టార్టప్ మారుత్ను ఎంపిక చేసుకొన్నది.
డ్రోన్ సర్వీస్ అందించేందుకు స్విగ్గీకి దేశవ్యాప్తంగా 354 కంపెనీల నుంచి దరఖాస్తులు అందగా, మారుత్నే ఎంచుకొన్నది. పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు, ఢిల్లీలో డ్రోన్ల ద్వారా సరుకులు రవాణా చేయనున్నది. టీహబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మారుత్ కంపెనీ.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రయోగాత్మక ప్రాజెక్టుకు కూడా ఎంపికైంది.
డార్క్ స్టోర్ల నుంచి.. ఎంపిక చేసిన కామన్ పాయింట్ వరకు గ్రోసరీ వస్తువులను డ్రోన్ల ద్వారా డెలివరీ చేస్తారు. అక్కడి నుంచి డెలివరీ పార్ట్నర్లు పికప్ చేసుకొని కస్టమర్ల ఇంటికి చేరవేస్తారు. స్విగ్గీ తెలిపిన వివరాల ప్రకారం డార్క్ స్టోర్ అనేది చిన్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్. దీన్ని అల్ట్రా ఫాస్ట్ డెలివరీ కోసం వాడుతారు.
టీ-హబ్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి డ్రోన్ సేవలను అందిస్తున్నాం. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు మందులను సరఫరా చేశాం. ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ సర్వీస్ కోసం మారుత్ ఎంపికైంది. స్విగ్గీ చేపడుతున్న పైలట్ ప్రాజెక్టుకు ఎంపికవటం ఆనందంగా ఉన్నది.
– ప్రేమ్, మారుత్ డ్రోన్ వ్యవస్థాపకుడు