హైదరాబాద్, జనవరి 11 : దివ్యాంగులు ప్రైవేటురంగంలో ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ)లో 21 కోర్సుల్లో శిక్షణనివ్వనుంది. శిక్షణకు అర్హులైన అభ్యర్థుల ఎంపికకు మెప్మా సహకారం తీసుకోనుంది. సదరం ఐడీ నంబర్ ఉండి, కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వారిని ఈ శిక్షణ కోసం అర్హులుగా నిర్ణయించారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసరా పింఛనుదారుల జాబితా ఆధారంగా దివ్యాంగులకు సమాచారం ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న వారికి ఇష్టమైన కోర్సుల్లో మూడు నెలల పాటు రెసిడెన్షియల్ విధానంలో ఉచితంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగ సదుపాయం కూడా కల్పించనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, జనరల్ ప్లంబర్, పెయింటర్, డెకోరేటర్, రిటైల్ సేల్స్ అసోసియేట్, టైలర్, చెఫ్ ట్రైనింగ్, బేకరీ పదార్థాల తయారీ, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, అకౌంటింగ్ సర్టిఫికెట్ కోర్సు, (టాలీ, జీఎస్టీ), మల్టీ మీడియా యానిమేషన్, బ్యూటీషియన్, సీసీటీవీ ఇన్స్టాలేషన్, ఆటోకాడ్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్యాషన్ డిజైనింగ్, పీసీబీ డిజైనింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.