సికింద్రాబాద్, డిసెంబర్ 8 : కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. బుధవారం కంటోన్మెంట్ బోర్డు సీఈవో అజిత్రెడ్డిని బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్నతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ సభ్యుడు ప్రభాకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానంగా జీహెచ్ఎంసీ నుంచి కంటోన్మెంట్ బోర్డుకు డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన తాగునీటి సరఫరా నీటి బిల్లులను మంజూరు చేసిన అంశాలపై కీలకంగా చర్చించారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే సాయన్న, జక్కుల మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 2న మడ్ఫోర్ట్, సిల్వర్ కంపౌండ్లోని డబుల్ బెడ్ రూం ఇండ్లకు సంబంధించిన తాగునీటి బిల్లులు సుమారు రూ. 50.40లక్షలను రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు జమ చేసిందన్నారు. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి సరఫరా జరుగుతుందని, ఇప్పటికే బోర్డు అధికారులు, జలమండలి అధికారుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉచిత తాగునీటి సరఫరాకు ప్రత్యేకంగా చొరవ చూపుతున్న మంత్రి కేటీఆర్, జలమండలి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆదే విధంగా రెండవ వార్డులోని రసూల్పురా నారాయణ జోపుడి సంఘంలో డబుల్ ఇండ్ల పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, వీటితో పాటు ఆయా వార్డుల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయించి త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.