హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. విశ్వవిద్యాలయాల్లో 4 వేల బోధన, బోధనేతర పోస్టులు, పాఠశాల విద్యలో 13,086 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. పాఠశాల, సాంకేతిక, ఉన్నత విద్య బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, కేపీ వివేకానంద్ వ్యక్తంచేసిన అభిప్రాయాలపై మంత్రి సమాధానమిచ్చారు. విద్యారంగంలో వినూత్నమార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పన, ఇంగ్ల్లిష్ మీడియంలో విద్యాబోధన, ఉపాధ్యాయుల నియామకం అనే త్రివేణి సంగమంలో తెలంగాణ విద్యారంగం పునీతం కాబోతున్నదని, పండుగ వాతావరణం నెలకొన్నదని వ్యాఖ్యానించారు. వృత్తి విద్యా కోర్సుల్లో కొత్త సిలబస్ రూపకల్పనకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకొన్నట్టు వెల్లడించారు. రూ.7,289 కోట్లతో తలపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి అవసరమైన అనుమతులు, నిధులను ఆన్లైన్లోనే మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే రూ. కోటి చొప్పున మంజూరు చేసినట్టు తెలిపారు.
గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థికి రూ.1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్టు మంత్రి సబితారెడ్డి వివరించారు. గురుకుల విద్యార్థుల్లో 489 మంది ఐఐటీ, 866 మంది నీట్, 2,200 మంది ట్రిపుట్ ఐటీల్లో అడ్మిషన్లు పొందారని తెలిపారు. కేజీ టు పీజీలో భాగంగా 1,050 కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ, లా కోర్సులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ ఫెలోషిప్ ఇవ్వాలన్న ఎమ్మెల్యేల ప్రతిపాదనలను, టెట్, యూనివర్సిటీ రిక్రూట్మెంట్, టీసీలతో నిమిత్తం లేకుండా అడ్మిషన్లపై స్పందించిన మంత్రి ఆయా అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటీ పఢావో పథకం నినాదాలకే పరిమితమైందని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. విద్యాసంస్థలను నెలకొల్పడంలో కేంద్రం తెలంగాణను పూర్తిగా విస్మరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర రాష్ర్టాలకు ఐఐఎంలు, ఐఐటీలు, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలు, మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాలను మంజూరుచేసిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పారు. కేంద్రం ఇవ్వకపోయినా రూ.400 కోట్లు వెచ్చించి తెలంగాణ ప్రభుత్వమే మోడల్ స్కూళ్లను నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.