వెంగళరావునగర్, డిసెంబర్ 21 : పదేండ్ల కుమారుడి ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవాలని తపనపడే తండ్రిని ఆయుర్వేద వైద్యం పేరిట మోసగాళ్లు దగా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉమ్మారెడ్డి శ్రీకాంత్రెడ్డి తన కుమారుడితో కలిసి ఇటీవల కూకట్పల్లిలోని ఓ షాపింగ్మాల్కు వెళ్లారు. అక్కడికి వినియోగదారుడిగా వచ్చిన గురప్ప అనే వ్యక్తి శ్రీకాంత్రెడ్డిని పరిచయం చేసుకున్నాడు. మీ బాబు చలాకీగా లేడు.. చూపు కూడా సరిగా లేదని, నిస్తేజంగా కనిపిస్తున్నాడేంటని ప్రశ్నించాడు. తన అన్న కుమార్తెకు కూడా ఇలానే నిస్తేజంగా ఉండగా.. ఆయుర్వేద మూలికలు వాడటంతో నయమైందని తెలిపి శ్రీకాంత్రెడ్డి ఫోన్ నంబర్ తీసుకున్నాడు.
అ తర్వాత దుర్గప్ప అనే వ్యక్తి శ్రీకాంత్రెడ్డికి ఫోన్ చేసి ఆయుర్వేద మందు తయారీ విధానాన్ని చెప్పాడు. మర్నాడు శ్రీకాంత్రెడ్డి ఇంటికి వచ్చిన గురప్ప ఎస్ఆర్నగర్లోని ఆయుర్వేద షాపునకు తీసుకెళ్లాడు. కౌంటర్లో ఉన్న హజ్రత్, రాకేశ్లు గురప్ప తెచ్చిన ఆయిల్లో కొన్ని చూర్ణాలను కలిపి ఇచ్చారు. మందుకు రూ.1.81లక్షల బిల్లు వేసి.. శ్రీకాంత్రెడ్డి నుంచి వసూలు చేశారు. వారు చెప్పిన విధంగా మూడు నెలల పాటు ఆయుర్వేద నూనెతో బాబు ఒంటిపై మర్ధన చేసినా ఎలాంటి మార్పు కనిపించలేదు. మూడు నెలల తర్వాత దుకాణానికి వెళ్లగా దుకాణం ఎత్తేశారు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన శ్రీకాంత్రెడ్డి ఎస్ఆర్నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.