బంజారాహిల్స్, డిసెంబర్ 14 : బజాజ్ ఫైనాన్స్ ద్వారా లోన్ మంజూరు చేస్తామంటూ నమ్మించి బురిడీ కొట్టించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.11లో నివాసముంటున్న మేడి కుమారి గృహిణి. ఈనెల 11న ఫేస్బుక్లో బజాజ్ ఫైనాన్స్ నుంచి రూ.5లక్షల వరకు రుణం అంటూ ప్రకటనలో ఉండటంతో ఆ లింక్ను ఓపెన్ చేసింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేస్తే రుణం వస్తుందా.. లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
దీంతో వారి సూచనలకు అనుగుణంగా కార్డుల వివరాలను పంపించగా రూ.5లక్షల రుణం మంజూరైందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రాసెసింగ్ ఫీజు, ప్రీమియం, జీఎస్టీ తదితర ఫీజుల పేరుతో రూ.30వేలు వసూలు చేయగా.. మోసపోయినట్లు గుర్తించింది. ఈ మేరకు బాధితురాలు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బంజారాహిల్స్, డిసెంబర్ 14 : ఖరీదైన కారును డిస్కౌంట్ ధరలో ఇప్పిస్తామని నమ్మించిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం.82లోని సినార్ వ్యాలీలో నివాసముంటున్న వీపీ.ఆనంద్ అనే వ్యాపారి 2017లో కొత్త కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. అయితే బంజారాహిల్స్ రోడ్ నం.14లోని స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ సంస్థ నిర్వాహకుడు ఆత్మకూరి ఆకాశ్తో పాటు అతడి స్నేహితులు అజయ్ మతేనా, విజయ్ కంజి తదితరులు డిస్కౌంట్ ధరల్లో లగ్జరీ కార్లు అమ్ముతున్నారని తెలిసింది.
రూ.18లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కారును రూ.15లక్షలకే ఇస్తామని వారు నమ్మబలకడంతో అడ్వాన్స్గా రూ.10.8లక్షలు చెల్లించాడు. త్వరలోనే కారుతో పాటు కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిస్తామని నమ్మించారు. కాని ఇప్పటివరకు పంపించలేదు. అయితే తనతో పాటు పలువురిని ఇదే విధంగా మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఆకాశ్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆనంద్ కోర్టును ఆశ్రయించగా కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆకాశ్గౌడ్ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులు నిందితులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.