సిటీబ్యూరో, డిసెంబర్ 13(నమస్తే తెలంగాణ): కిట్టిపార్టీల కిలాడీ శిల్పా చౌదరి మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమెకు ఆరు ఖాతాలు.. ఓ లాకర్ ఉన్నట్లు నార్సింగి పోలీసులు గుర్తించారు. వాటిని తనిఖీ చేసేందుకు బ్యాంకు అధికారుల అనుమతి కోరారు. అయితే శని, ఆదివారాలు కావడంతో కొన్నింటికి అనుమతి వచ్చింది. వాటిని తనిఖీ చేస్తే మరికొంత సమాచారం వస్తుందని భావిస్తున్న పోలీసులు..మూడో సారి రెండ్రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం ఒక రోజు కస్టడీకి అనుమతించింది. దీంతో ఆమెను మంగళవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. అదేరోజు ఖాతాలు, లాకర్లో సోదాలను నిర్వహించనున్నారు.
శిల్పాచౌదరి ఎవరితోనైనా గంట సేపు మాట్లాడిందంటే చాలు.. సులభంగా బుట్టలో వేసేస్తుందని ఆమె బాధితులు చెబుతున్నారు. తన మాటలతో మాయ చేసి.. డబ్బులను ఇట్టే వసూలు చేస్తుందని వాపోతున్నారు. శిల్ప మాటలు చాలా తీయగా ఉంటాయని, ఆ క్షణంలో ఆమె అడిగిన డబ్బుకు నో చెప్పే చాన్స్ ఉండదని అంటున్నారు.
శిల్పా చౌదరి బాధితులకు ఇచ్చిన ఆభరణాలు కంగుతినిపించాయి. బాధితులు వాటిని గిరివికి తీసుకెళ్లినప్పుడు గిల్టుగా తేలడంతో బాధితులు అవాక్కయ్యారు. ఇలా బంగారు ఆభరణాలు తీసుకున్న ఓ స్టార్ హీరో సోదరి సైతం కంగుతింది. అదే విధంగా శిల్పా చౌదరి తీసుకున్న అప్పుకు చెక్కులు ఇవ్వడంతో అవి కొన్ని బౌన్స్ అవ్వగా.. మరికొన్ని ఫేక్ అని బ్యాంకు అధికారులు తేల్చడం కొసమెరుపు.