కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి కోలుకుంటున్న నిర్మాణ రంగానికి ధరలు శరాఘాతంగా మారుతున్నాయి.
ఓపక్క స్టీల్ ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మరోపక్క సిమెంట్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి.
ఈ ధరల దెబ్బకు అనేకమంది బిల్డర్లు నిర్మాణాలను వాయిదా వేసుకునే పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ జోరు మీదున్న నిర్మాణ రంగం.. గత కొన్నిరోజులుగా నెమ్మదిస్తున్నది. ఇప్పటికే ప్రారంభమైనవి మినహా.. కొత్త నిర్మాణాలను మొదలు పెట్టేందుకు బిల్డర్లు జంకుతున్నారు. ముఖ్యంగా ఉక్కు ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకడం నిర్మాణ వ్యయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. కరోనా ముందుతో పోలిస్తే స్టీల్ ధరల్లో టన్నుకు ఏకంగా రూ.20-30వేల పెరుగుదల కనిపిస్తున్నది. బస్తా సిమెంట్ ధర సైతం రూ.30-50 ఎగిసింది. వచ్చే నెలలోరేట్లు మరింత పెరగవచ్చన్న అంచనాలు అటు వినియోగదారుల్లో.. ఇటు నిర్మాణదారుల్లో కలవరపెడుతున్నాయి.
వాస్తవానికి హైదరాబాద్ చుట్టుపక్కలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ సమయంలోనూ నిర్మాణ రంగం ఊపు మీదున్నది. ఒకవైపు బడా బిల్డర్లు, నిర్మాణ సంస్థలు కొత్తకొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంతోపాటు సామాన్యులు సైతం సొంతింటి కలను నెరవేర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. గృహ రుణ వడ్డీరేట్లు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. అయితే నిరుడు అక్టోబర్లో మొదలైన స్టీల్, సిమెంట్ ధరల పెరుగుదల రెండు, మూడు నెలల పాటు కొనసాగింది. మధ్యలో సిమెంట్ ధరలు కాస్త తగ్గినా.. ఉక్కు ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో ధరలు రూ.10-15వేల వరకు పెరిగాయి. కొన్ని కంపెనీలైతే నో-స్టాక్ బోర్డులు పెడుతున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు ఆగిపోతున్నాయి. యుద్ధం ముగిస్తే ధరలు తగ్గుముఖం పడతాయన్న యోచనతోనూ కొందరు నిర్మాణాల్ని వాయిదా వేస్తున్నారు.