న్యూయార్క్ : ఉక్రెయిన్లో ఫాక్స్ న్యూస్ కెమెరామెన్ మృతి చెందారు. ఈ విషయాన్ని అమెరికా నెట్వర్క్ తెలిపింది. ఉక్రెయిన్లో జరిగిన ప్రమాదంలో కెమెరా మెన్ పియరీ జాక్రెజ్స్కీ మృతి చెందినట్లు పేర్కొంది. సోమవారం కైవ్ వెలుపల హోరెంకాలో కామెరామెన్ ప్రయాణిస్తున్న వాహనం అగ్ని ప్రమాదానికి గురైందని, ఈ ఘటనలో జాక్రెజ్స్కీ మృతి చెందగా.. అతని సహోద్యోగి బెంజమిన్ హాల్ గాయపడ్డనట్లు ఫాక్స్ మీడియా సీఈవో సుజాన్ స్కాట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు ప్రారంభించి 20వ రోజుకు చేరింది. ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకు పలుమార్లు చర్చలు జరిగినా ఇంత వరకు ఏకాభిప్రాయం కుదరలేదు.
ఈ క్రమంలో ఉక్రెయిన్పై రష్యన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. నిత్యం పలు నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. మరో వైపు రష్యా వద్ద సైనిక పరికరాలు, మందుగుండు సామగ్రి వేగంగా తగ్గిపోతున్నది. ప్రస్తుతం రష్యా వద్ద కేవలం పది రోజులకు సరిపడా మందుగుండు మాత్రమే ఉందని అమెరికా మాజీ సైనిక అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ కోర్టు ఈ నెల 16న తీర్పును వెలువరించే అవకాశం ఉన్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అడువులను నరికివేసేందుకు సిద్ధమవుతున్నాడని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్పై రష్యా వెనక్కి తగ్గకపోవడంతో బ్రిటన్ మరికొన్ని ఆంక్షలను అమలులోకి తీసుకువచ్చింది.