మన్సూరాబాద్, నవంబర్ 11 : పెండ్లికి నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడిచేసి గాయపర్చిన ప్రేమోన్మాదికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా, దౌల్తాబాద్ మండలానికి చెందిన యువతి, యువకుడు గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు సదరు యువతిని హస్తినాపురం సెంట్రల్లో ఉండే ఆమె పిన్ని వద్ద ఉంచుతున్నారు. మరో యువకుడితో పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకునేందుకు యువతి అంగీకరించడంతో ఈ మధ్యనే నిశ్చితార్ధం జరిగింది. తన ప్రేమను నిరాకరించి వేరే యువకుడిని పెండ్లి చేసుకుంటుందని యువతిపై బస్వరాజు కోపం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం హస్తినాపురం సెంట్రల్లోని యువతి పిన్ని ఇంటికి చేరుకున్న బస్వరాజు యువతిపై ఇరవై సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచి గాయపర్చాడు. ప్రస్తుతం సదరు యువతి హస్తినాపురంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. యువతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు బస్వరాజుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా పద్నాలు రోజులు రిమాండ్ విధించనట్లు ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి తెలిపారు.