లక్నో : ఆ నలుగురిది సామాన్య గిరిజన కుటుంబం. జీవితంలో ఒకసారైనా హెలీకాప్టర్ ఎక్కాలనేది కోరిక. ఎట్టకేలకు వారి కల ఫలించి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన అధికారిక హెలీకాప్టర్లోనే చక్కర్లు కొట్టారు. సుమారు అరగంట పాటు పలు ప్రాంతాలను చుట్టి వచ్చారు.. జీవితకాల స్వప్నం నెరవేరడంతో సంబురపడుతున్నరు.. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలోని జోబాట్ తహసీల్కు చెందిన దరియవ్ సింగ్, మంగళ్ సింగ్, రిచ్చు సింగ్ బఘెల్, జోధ్ సింగ్ అనే నలుగురు గిరిజనులు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారిక చాపర్లో సుమారు అరగంట పాటు రన్బైడా నుంచి సెజవాడ వరకు చక్కర్లు కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికకు ముందు సీఎం జన దర్శన్ యాత్రలో భాగంగా ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పర్యటించారు.
రాబోయే రోజుల్లో జోబాట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలో షెడ్యూల్ చేసిన కార్యక్రమాల్లో సీఎం లేకుండానే చాపర్లో నలుగురు గిరిజనుల ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కళావతి భూరియా మరణం తర్వాత జోబాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో నియోజకవర్గానికి సీఎం శివరాజ్ వరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా పర్యటనకు కోసం వచ్చిన సీఎంకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. అయితే, తమ కలను నెరవేర్చినందుకు సీఎంకు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.