హైదరాబాద్ : వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నాలుగు కొత్త ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను (RET) ప్రారంభించింది. ఈ అదనపు ఆర్ఈటీలు ప్రస్తుతం ఉన్న రన్ వే సామర్థ్యాన్ని 36 నుంచి 45 వరకు పెంచే లక్ష్యానికి తోడ్పడనున్నాయి. ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలతో పాటు, రిహాబిలిటేషన్ పనుల అనంతరం హైదరాబాద్ విమానాశ్రయం ప్రాథమిక రన్వేను కూడా విజయవంతంగా ప్రారంభించింది.
కొత్త ఆర్ఈటీలతో విమానాశ్రయ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు విమానాలు రన్వేకు కొద్ది దూరం నుంచే ట్యాక్సీయింగ్ చేసే విధంగా రూపొందించారు. వీటితో రన్ వే ఆక్యుపెన్సీ సమయం తగ్గి, తద్వారా రన్వే సామర్థ్యం పెరుగుతుంది. రిహాబిలిటేషన్తో పేవ్మెంట్ క్లాసిఫికేషన్ నెంబర్ (PCN), రన్వే ఫ్రిక్షనల్ విలువలు పెరుగనున్నాయి. తద్వారా విమానాశ్రయం నుంచి వచ్చీపోయే విమానాల భద్రత పెరుగనుంది. వీటితో పాటు, జీహెచ్ఐఏఎల్ తన ఎయిర్సైడ్ లైటింగ్లో 98శాతం (ఎయిర్ఫీల్డ్ సైనేజ్, టాక్సీవే సెంటర్లైన్ లైట్లు, రన్వే లైట్లు) సమర్థవంతమైన ఎల్ఈడీ లైటింగ్లు మార్చడం ద్వారా మరో హరిత మైలురాయిని చేరుకుంది.
దీనితో విద్యుత్ గణనీయంగా ఆదా అవడమే కాకుండా కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. రన్వే, ఇతర ఎయిర్ఫీల్డ్ లైటింగ్లు ఎయిర్ పోర్టుల సురక్షిత కార్యకలాపాలకు కీలకం. కొత్తగా అమర్చిన ఎల్ఈడీ లైట్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఎయిర్ఫీల్డ్స్ స్పష్టంగా కనిపించడానికి దోహదపడి, విమానాల సురక్షిత రాకపోకలకు సహకరిస్తాయి. ఈ ఏరోనాటికల్ గ్రౌండ్ లైటింగ్ (AGL) అప్గ్రేడేషన్ రన్వే రిహాబిలిటేషన్ పనుల్లో భాగంగా చేపట్టారు. విమానాశ్రయ ప్రారంభం నుంచి జీహెచ్ఐఏఎల్ కార్యకలాపాలను పర్యావరణ అనుకూల, సుస్థిర విధానాల్లో నిర్వహించడానికి కట్టుబడి ఉంది. వివిధ ఇంధన పరిరక్షణ విధానాల ద్వారా గణనీయమైన ఇంధన ఆదాను సాధిస్తోంది. ఇందులో భాగంగా గతంలో టెర్మినల్ భవనం, కార్యాలయాల వద్ద హాలోజన్ లైటింగ్ను ఎల్ఈడీలకు మార్చారు.