కమలాపూర్, నవంబర్ 17: ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్స్టేషన్లో వరంగల్ సీపీ తరుణ్జోషి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కమలాపూర్లో ఓ ఇంటిని టీఆర్ఎస్ కార్యాలయానికి అద్దెకు తీసుకున్నారు.
దీన్ని జీర్ణించుకోలేని బీజేపీ కార్యకర్తలు ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తిపై కక్ష పెంచుకున్నారు. పార్టీ ప్రచారం కోసం కమలాపూర్ టీఆర్ఎస్ కార్యాలయానికి వస్తూపోతున్న బాల్క సుమన్కు సదరు ఇంటి సభ్యుల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టు హైదరాబాద్కు చెందిన సందీప్ఠాగూర్ ఓ వీడియోను రూపొందించాడు. దాన్ని మాదన్నపేటకు చెందిన బండి సదానందం, కమలాపూర్కు చెందిన వడ్డె రమేశ్, పంగిడిపల్లికి చెందిన వసంతరావు, గూనిపర్తి వాసి కడారి వెంకటేశ్, హైదరాబాద్కు చెందిన సునీల్గౌడ్, లక్ష్మీ వీరమల్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేశారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్తోపాటు సదరు మహిళ వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా హుజూరాబాద్తోపాటు హనుమకొండ జిల్లాకు చెందిన వాట్సాప్ గ్రూపులకు పంపించి ప్రచారం చేశారు. తమపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు సీపీ చెప్పారు. ఇందుకు బాధ్యులైన ఏడుగురిని గుర్తించి, అందులో బండి సదానందం, వడ్డె రమేశ్, వసంతరావు, కడారి వెంకటేశ్ను అరెస్ట్ చేశామన్నారు. సందీప్ ఠాగూర్, సునీల్ గౌడ్, లక్ష్మీ వీరమల్లు పరారీలో ఉన్నట్టు సీపీ పేర్కొన్నారు.