Tahsildar Sign Forgery | జగిత్యాల జిల్లాలో ఏకంగా మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ ముద్రలతో తప్పుడు పత్రాలను సృష్టించి, భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టనంలోని ఆరపేట వార్డు శివారులోని సర్వే నంబర్ 191 భూమికి సంబంధించిన నకిలీ ఆబాది సర్టిఫికెట్ తయారు చేశారు. ఇందుకోసం మెట్పల్లి తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాల ముద్రలను పోలిన నకిలీ స్టాంప్లన తయారు చేశారు. వాటి సాయంతో సర్వే నంబర్ 191 భూమిని ఇతరుల పేరు మీదకు రిజిస్ట్రేషన్ చేయించారు.
నకిలీ పత్రాల ఆధారంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లుగా బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నేరం రుజువు కావడంతో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకలీ స్టాంప్లతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన రాజులదేవి నర్సయ్య, కలికోట వేణు, గోలపు గణేశ్, పాకాల రాజేశ్లను మెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కంప్యూటర్ పరికరాలు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెజ్జారపు మధుసూదన్, అంగారి శంకర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమ లావాదేవీలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.