రామగిరి, సెప్టెంబర్ 05 : నల్లగొండ జిల్లా కేంద్రలోని పాతబస్తీ హనుమాన్ నగర్లో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నంబర్-01 వినాయక విగ్రహం వద్ద ఎప్పుడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాధారణంగా ఈ విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ప్రజా ప్రతినిధులను, వివిధ పార్టీల అధ్యక్షులను, పుర ప్రముఖులను, ఆధ్యాత్మికవేత్తలను వేదికపై ఆహ్వానించి వారితో శాంతి సందేశం ఇప్పించే ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఈసారి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని వేదిక పైకి పిలవకపోవడం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రసంగిస్తూ లతీఫ్ సాబ్ గుట్టపై ఘాట్ రోడ్డు పనులు, పలు రాజకీయ విషయాలను ప్రస్తావించడంతో సమస్య ఉత్పన్నమైంది. కోపోద్రిక్తులైన పలువురు నాయకులు, భక్తులు, ప్రజలు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదే క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి సహితం మంత్రి మాట్లాడిన తీరును తప్పుబట్టారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వాగ్వివాదంతో పాటు తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని నాగం వర్షిత్ రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ కారులో వేసి తీసుకెళ్లారు.
అదే సమయంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన అనుచరులు, బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అడ్డుకుని కంచర్లను లోనికి వెళ్లనీయలేదు. బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈలోగా పోలీసులు మంత్రిని అక్కడి నుండి పంపించడంతో లోపలికి వెళ్లిన కంచర్ల జరిగిన విషయం తెలుసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడి దగ్గర రాజకీయాలు కూడదన్నారు. తాము పదేండ్లు అధికారంలో ఉన్నా ఏనాడు ఇటువంటి సంఘటనలు జరగని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాగం వర్షిత్ రెడ్డి పట్ల పోలీసుల ప్రవర్తన ఎవరి మెప్పు కోసమని ప్రశ్నించారు. దేవుడి దగ్గర రాజకీయాలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు.
అలాగే నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేసేంత వరకు తాము ఒకటో నంబర్ విగ్రహాన్ని కదలనివ్వమని పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే నాగం వర్షిత్ రెడ్డిని విడుదల చేశారు. అనంతరం వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, నాయకులు సింగం రామ్మోహన్, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేశ్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, పల్లె రంజిత్కుమార్, గుండెబోయిన జంగయ్య, దొడ్డి రమేశ్, బీపంగి కిరణ్, మహిళా నాయకులు కొండ్ర స్వరూప, కొప్పోలు విమలమ్మ, పెరిక ఝౌన్సీ పాల్గొన్నారు.
Ramagiri : దేవుడి దగ్గర రాజకీయాలా ? మంత్రి కోమటిరెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల మండిపాటు