ముంబై : మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు స్వల్ప ఊరట లభించింది. మాజీ హోంమంత్రిని మరోసారి ఈడీ కస్టడీ పొడగించాలని కోరగా.. ముంబైలోని ప్రత్యేక కోర్టు ఇందుకు నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతకు ముందు అనిల్ దేశ్ముఖ్కు అధికారులు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం దవాఖానకు తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరుచగా.. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
మనీ లాండరింగ్ కేసులో నవంబర్ 1న ఆయనను ఈడీ అరెస్టు చేయగా.. 2న కోర్టు నవంబర్ 6వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. మరో వైపు మాజీ హోంమంత్రి కుమారుడు హృషికేశ్ దేశ్ముఖ్కు ఉపశమనం లభించలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 12వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు విచారణ, అరెస్టు నుంచి ఎలాంటి ఉపశమనం కల్పించలేదు. మనీ లాండరింగ్ వ్యవహారంలో తమ ఎదుట హాజరుకావాలని ఈడీ జారీ చేసిన నోటీసులకు మాజీ మంత్రి స్పందించలేదు.
గతవారం బాంబే హైకోర్టు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో ఆయన గత సోమవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 12 గంటలకుపైగా విచారించిన అనంతరం అర్ధరాత్రి ఈడీ అనిల్ దేశ్ముఖ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో మాజీ హోంమంత్రి ప్రత్యక్షంగా పాల్గొన్నాడని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఎన్సీపీ నేత కీలక నిందితుడగా తేలిందని ఈడీ రిమాండ్ నోట్లో పేర్కొంది. మరో వైపు సచిన్ వాజే పోలీస్ కస్టడీలో ఉండగా.. ముంబైలోని ఎస్ల్పానేడ్ కోర్టు మాజీ పోలీస్ అధికారికి నవంబర్ 13 వరకు పోలీస్ కస్టడీకి పంపింది.