కృష్ణకాలనీ, డిసెంబర్ 30 : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోల జనార్దన్ అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, భూపాలపల్లి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి మృతుడి స్వగ్రామమైన గణపురం మండల కేంద్రానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పూలమాలలుంచి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కోల జనార్దన్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలి రోజుల్లో 2001 నుంచి 2005 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీని ముందుకు నడిపించారన్నారు. ఉద్యమ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. బీఆర్ఎస్ గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. జనార్దన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్రెడ్డి, నాయకులు పోలుసాని లక్ష్మీనరసింహారావు, భరత్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.