హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, ఇతర సభ్యులతో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులకు స్పష్టంచేశారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి వచ్చేనెల 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధివిధానాల రూపకల్పనపై బుధవారం ఆయన అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటుచేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని సూచించారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ శోభ, రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ , పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, అడిషనల్ పీసీసీఎఫ్ పరగెన్ తదితరులు పాల్గొన్నారు.