న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులకు తీవ్ర పోటీ ఏర్పడింది. వచ్చే ఐదేండ్ల కాల పరిమితి హక్కుల కోసం దేశీయ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు బిడ్ వేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే యూకేకు చెందిన ‘స్కై స్పోర్ట్స్’, దక్షిణాఫ్రికా సంస్థ ‘సూపర్ స్పోర్ట్’ సంస్థలు కూడా టెండర్ పత్రాలు (ఇన్విటేషన్ టు టెండర్-ఐటీటీ) తీసుకున్నాయి.
హక్కుల ద్వారా రూ.32,890 కోట్లు వాస్తవ ధరగా నిర్ణయించగా.. రూ.50 వేల కోట్ల ఆదాయం వస్తుందని బీసీసీఐ భావిస్తున్నది. హక్కులను నాలుగు భాగాలుగా విభజించగా.. భారత్లో ప్రసారం, డిజిటల్ రైట్స్, 18 కీలక మ్యాచ్లు (టోర్నీ ఆరంభోత్సవం, వారాంతపు డబుల్ హెడర్స్, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు), ‘భారతదేశం అవతల’ పేరిట మీడియా హక్కులను కేటాయించనున్నారు. విదేశాల్లో ప్రసార హక్కుల కోసం స్కై స్పోర్ట్స్, సూపర్స్పోర్ట్ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఇక దేశీయ హక్కుల కోసం వయాకామ్-18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ, డ్రీమ్11, స్టార్ (ప్రస్తుత హక్కుదారు) తదితర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బిడ్ డాక్యుమెంట్లకు ఈనెల 10వ తేదీ ఆఖరు కాగా, ఐపీఎల్ అనంతరం ఈ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఎవరూ ఎక్కువ ధరకు పాడితే వారికి హక్కులు దక్కనున్నాయి.