సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) ; స్మార్ట్ఫోన్లకు బానిసవుతున్న పిల్లలు వాటిల్లో ఆడుతున్న వీడియో గేమ్లతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నాయి విదేశీ సంస్థలు. చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు యాప్లను కేంద్రం నిషేధించినా మారుపేర్లతో చిరునామాలు మారుస్తూ కొత్తరకం యాప్లను రూపొందిస్తున్నాయి. అడ్రస్సు, రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా గూగుల్, ఆపిల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ అయ్యే మాయదారి యాప్ల్లోని వీడియో గేమ్ల మోజులో పడి పిల్లలు, మధ్య వయస్కులు కోట్లాది రూపాయలను ముట్టజెప్పుతున్నారు. పిల్లల ఉత్సుకతను ఆసరా చేసుకుంటున్న విదేశీ వీడియో గేమింగ్ సంస్థలు వారిని శారీరకంగా,మానసికంగా ఎదగనివ్వడం లేదు. వీడియో గేమింగ్ల ద్వారా పలు సంస్థలు ఏటా 5 వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయని ఓ దర్యాప్తులో సైబరాబాద్ పోలీసులు తేల్చారు.
నాడు పబ్జీ.. నేడు ఫ్రీ ఫైర్
పబ్జీ గేమ్లో ఉన్న పలుస్థాయిల్లో గెలిచేందుకు పిల్లలు తహతహలాడేవారు. కొన్నిసార్లు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం దీన్ని నిషేధించింది. అయితే చైనాకు చెందిన వీడియో గేమింగ్ సంస్థ సింగపూర్ కేంద్రంగా పబ్జీ స్థానంలో ‘ఫ్రీఫైర్’ వీడియో గేమ్స్ యాప్లు,అప్లికేషన్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పలు ఆఫర్లు, ఒత్తిడికి గురిచేసే ఆటలు పెట్టి నగదు మాయం చేస్తోంది.
పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా !
కాసేపే కదాని పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు జాగ్రత్త. వీడియో గేమ్స్ ఆడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే మీ ఖాతా ఖాళీ ఖాయం. వీడియో గేమ్స్ ఆడుతూ అత్యధిక సమయం వృథా చేస్తున్న యువత, పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారిని వీడియో గేమ్స్కు బానిసలకు కాకుండా క్రీడలు, చదువు, పుస్తక పఠనం, ఇంట్లో పనులు దృష్టి మరల్చడం చాలా ఉత్తమం.
దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు..
మనదేశం నుంచి ఏటా రూ.5 వేల కోట్లు కాజేస్తున్న వీడియో గేమింగ్ సంస్థల వల్ల మనదేశం, రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు. ఈ సంస్థ నిర్వాకం వల్ల మంచి జరుగుతుందనే భావన అసలు లేదు. వీరి విచిత్ర వీడియో గేమ్ల వల్ల పిల్లలకు, యువతకు తీవ్ర ప్రమాదం నెలకొంది.
ఇప్పుడు ఫ్రీ ఫైర్
పబ్జీ బ్యాన్ తర్వాత చైనాకు చెందిన వీడియో గేమింగ్ సంస్థలు పంథా మార్చాయి. సింగపూర్లో ఓ వీడియో సంస్థను ఏర్పాటు చేసి పబ్జీ స్థానంలో ‘ఫ్రీఫైర్’ వీడియో గేమ్స్ యాప్లు, అప్లికేషన్స్ను అందుబాటులోకి తెచ్చాయి. ఎవరైనా దర్యాప్తు చేసినా దాని లొకేషన్ సింగపూర్ అని చూపిస్తుంది. ఇలా చైనా వీడియో గేమింగ్ సంస్థలు తమ మోసపూరితమైన వైనంతో సింగపూర్ సంస్థను చూపించి యువతను బానిసలను చేసే వీడియో గేమ్స్ను మాత్రం చైనా నుంచే రూపొందిస్తున్నారు.
ఈ అప్లికేషన్లకు మన దగ్గర రిజిస్ట్రేషన్ లేదు..
ఈ వీడియో గేమింగ్ సంస్థలకు మన దేశంలో ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ లేదు. కానీ ఏటా 5 వేల కోట్ల రూపాయల వరకు కాజేస్తున్నాయి. సింగపూర్, చైనా దేశాల్లో రిజిస్టర్ అయిన ఈ వీడియో గేమింగ్ అప్లికేషన్స్, యాప్లు నేరుగా గూగుల్, యాపిల్ సంస్థల నిబంధనలకు మాత్రమే అందులో రిజిస్టర్ అవుతున్నారు. అలా రిజిస్టరైన వారి యాప్లు నేరుగా గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇలా వారు మన దగ్గర ఎలాంటి రిజిస్టర్ లేకుండా, కార్యాలయాలు లేకున్నా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ప్రతి ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ప్రవేశిస్తున్నారు.
రిటైర్డ్ పోలీసు అధికారి
ఖాతా నుంచి రూ.11 లక్షలు
హైదరాబాద్కు చెందిన ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఖాతా నుంచి వీడియో గేమ్ ఆడిన మనవడు ఏకంగా మొత్తం 11 లక్షలు సమర్పించాడు. మనవడు వీడియో గేమ్ ఆడతానంటే స్మార్ట్ ఫోన్ను ఇచ్చారు తాత. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఓ సందర్భంలో అతనికి ఓ కల్పిత వస్తువు కొనాలని ఆప్షన్ వచ్చింది. అది రూ.300లే అంటూ ఓటీపీ చెప్పడంతో ఆ గేమ్లో ఇక ఆటో పేమెంట్ ఆప్షన్ యాక్టివేట్ అయ్యింది. ఆ తర్వాత ఎలాంటి ఓటీపీలు లేకుండానే ఆప్షన్స్కు ఒకే కొట్టగానే తాత ఖాతా నుంచి డబ్బులు ఖాళీ అయ్యాయి. ఇలా దాదాపు 11 లక్షల రూపాయలు పోయాయి. తీరా తాత కంగుతిని పోలీసులను ఆశ్రయించగా, తీగ లాగితే ఇంత పెద్ద బాగోతం బయటపడ్డింది.