బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ జట్టు కొత్త అధ్యాయం లిఖించింది. 73 ఏండ్ల థామస్కప్ చరిత్రలో తొలిసారి భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. చివరిసారి 1979లో సెమీస్లో సంతృప్తిపడ్డ టీమ్ఇండియా ఇన్నేండ్లకు తమ చిరకాల కలను సాకారం చేసుకుంది. ఉబర్కప్లో అమ్మాయిలు నిరాశపరుచగా, థామస్ కప్లో అబ్బాయిలు సత్తాచాటుతూ యావత్ దేశం గర్వపడేలా చేశారు. శుక్రవారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన సెమీఫైనల్ పోరులో భారత్ 3-2 తేడాతో డెన్మార్క్పై చిరస్మరణీయ విజయం సాధించింది. ఆదివారం జరిగే థామస్కప్ తుదిపోరులో 14 సార్లు చాంపియన్ ఇండోనేషియాతో ముఖాముఖి తలపడుతుంది.
సెమీస్ విషయానికొస్తే డెన్మార్క్తో పోరులో తొలుత జరిగిన సింగిల్స్ మ్యాచ్లో యువ షట్లర్ లక్ష్యసేన్ 13-21, 13-21తో విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత జరిగిన డబుల్స్లో భారత ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి 21-18, 21-23, 22-20తో కిమ్ అస్ట్రప్, మథియస్ క్రిస్టియన్ జోడీపై అద్భుత విజయం సాధించింది. తొలి గేమ్ నుంచే దూకుడు కనబరిచిన సాత్విక్, చిరాగ్ దీటైన పోటీతో పాయింట్లు దక్కించుకుంది. ఐదు మ్యాచ్ పాయింట్లతో మ్యాచ్ నువ్వానేనా అన్నట్లు సాగింది.
సింగిల్స్ పోరులో కిడాంబి శ్రీకాంత్ 21-18, 12-21, 21-15తో అండర్స్ అంటోన్సెన్ను ఓడించి భారత్ను పోటీలో నిలిపాడు. దీంతో ఆధిక్యం 2-1కి చేరుకుంది. డబుల్స్లో కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్గౌడ్ జోడీ 14-21, 13-21తో అండ్రెస్ రామ్సెన్, ఫెడ్రిక్ సోగర్డ్ జంట చేతిలో ఓడటంతో ఇరు జట్ల ఆధిక్యం 2-2తో సమమైంది. దీంతో నిర్ణయాత్మక ఆఖరి సింగిల్స్ మ్యాచ్ కీలకమైంది. ఈ పోరులో ప్రణయ్ 13-21, 21-9, 21-12తో రాస్మస్ జెమ్కెపై సంచలన విజయం సాధించాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన పోరులో ఆదిలోనే మడమ బెణకడంతో ఇబ్బంది పడ్డ ప్రణయ్..దెబ్బతిన్న పులిలా విజృంభించాడు. మెడికల్ టైమౌట్ తర్వాత నొప్పిని పంటి బిగువున భరిస్తూ ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఓవైపు గాయం వేధిస్తున్నా..వెరవకుండా భారత్కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
ఫైనల్
ఆదివారం: భారత్ X ఇండోనేషియా