న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు వేయడంపై భారత్ దృష్టి సారించాలని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు. టీకాలు బలంగా కొనసాగితే థర్డ్ వేవ్లో ఎక్కువ కరోనా కేసులు ఉండకపోవచ్చని సెరో సర్వే సూచించిందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కౌన్సిల్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో హైరిస్క్ గ్రూప్లకు టీకాల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు టీకాలు వేయని వారికి, ముఖ్యంగా ఎక్కువ ప్రమాదం ఉన్న వారికి టీకా వేయడంపై దృష్టి పెట్టాలని తాను అనుకుంటున్నానన్నారు.
ఇప్పటికీ చాలా మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వృద్ధులు, పలు వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేయలేదన్నారు. దీంతో వైరస్ సోకితే తీవ్రమై.. మరణించే అవకాశాలుంటాయని హెచ్చరించారు. బూస్టర్ డోస్కు బదులు.. దాని ద్వారా ప్రయోజనం పొందే వారికి టీకాలు ఇవ్వడంపై దృష్టి పెడితే.. ‘మేం ప్రాణాలు కాపాడగలం’ అన్నారు. మూడో, నాలుగో డోస్ తదితర విభిన్న విషయాలపై ప్రయత్నించడం కంటే వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులకు టీకాలు వేయాలన్నారు. ‘ప్రస్తుతం బూస్టర్ డోస్ అవసరం ఉందని చూపించేందుకు మా వద్ద తగినంత డేటా ఉందని.. నేను అనుకోవడం లేదన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశంలో 60కోట్లకుపైగా టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.