న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఫోర్బ్స్ 100 మంది ప్రపంచ అత్యంత శక్తిమంత మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో ఏడాది చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాదికిగాను 37వ స్థానంలో ఉన్న నిర్మల.. గతేడాది 41, అంతకుముందు ఏడాది 34వ స్థానాల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా ఆర్థిక మంత్రి జనెట్ యెల్లెన్ నిర్మల కంటే దిగువన 39వ స్థానంలో ఉండటం గమనార్హం. జాబితాలో భారత్ నుంచి హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈవో రోషిణి నాడార్ (52), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా (72), నైకా ఫౌండర్ ఫాల్గుణి నాయర్ (88)లు ఉన్నారు. ఇక అగ్రస్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్సీ స్కాట్ ఉన్నారు.