శ్రీశైలం : కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు గురువారం ఉదయం 68,491 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 844.90 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 69.90 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 12,713 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.