రైతు మెరుగ్గా బతకడంతో పాటు వారికి ఉజ్వల భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతోనే ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో ఆయిల్పామ్ సాగుపై 622మంది రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రెండు, మూడు రోజుల్లో నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
చిన్నకోడూరు, మార్చి 17 : రైతులు మెరుగ్గా బతకడంతో పాటు వారికి ఉజ్వల భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతోనే ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించామన్నారు. ఆయిల్పామ్ పంట సాగులో సిద్దిపేటను ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని సూచించారు. గురువారం చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ సాగుపై 622 మంది ఆయిల్పామ్ రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తాను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, అశ్వరావుపేట పర్యటించినప్పుడు ఆ ప్రాంతాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తూ మంచి లాభాలు గడించడం స్వయంగా చూశానన్నారు. సముద్రం నుంచి 120 నుంచి 130 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉండడంతో గాలిలో తేమ శాతం అధికంగా ఉండి ఆయిల్పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అపుడు సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని భావించినా.. గాలిలో పొడి వాతావరణం ఉండడంతో సాధ్యం కాలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా మారడం.. కాల్వలు, వాగులు, చెరువుల్లో సైతం వేసవిలో నీరు ఉండడంతో గాలిలో తేమ శాతం పెరిగిందన్నారు. అదే సమయంలో సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో తెలంగాణ జిల్లాల్లో వరి సాగు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అందివచ్చిన అవకాశం ఆయిల్పామ్ సాగేనని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఆయిల్పామ్ సాగు రైతులకు మంచి లాభసాటిగా ఉందన్నారు. పామాయిల్ సాగుకు ప్రభుత్వం అనేక సబ్సిడీలు అందిస్తుందన్నారు. మొక్కలు, ఎరువులు, డ్రిప్లపైన రాయితీలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్న లక్ష్యంతో సిద్దిపేట జిల్లాలో 50,585 ఎకరాల్లో ఆయిల్పామ్ పంట సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ఆయిల్పామ్ మొక్కల కొరత ఏర్పడటంతో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు అధికారులను పంపి 40 వేల ఎకరాలకు సరిపడా ఆయిల్పామ్ స్పాట్స్ తెప్పించామన్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రంగనాయకసాగర్ జలాశయం వద్ద 50 వేల ఎకరాలు ఆయిల్పామ్ నర్సరీ కోసం కేటాయించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును 622 మంది రైతులు చేపట్టారన్నారు. 5 ఎకరాల లోపు రైతులకు ఎకరాకు రూ.81 వేలపైన రాయితీ, 5 ఎకరాలు ఆపైన సాగు చేసే రైతులకు రూ.24,800 రాయితీ అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
రైతులు మూడేండ్లు పంటను జాగ్రత్తగా కాపాడుకుంటే దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఉంటాయని మంత్రి అన్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏండ్లు క్రమం తప్పకుండా స్థిర ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్పామ్ సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. ఎకరానికి నికరంగా రూ.లక్షన్నర ఆదాయం వస్తుందన్నారు. గెలలో వచ్చే నూనె ఆధారంగా చెల్లింపులు చేస్తారని మంత్రి తెలిపారు. సాగు చేసిన నాలుగేండ్ల తర్వాత పంట చేతికి రావడం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి 15 రోజులకు గెల వస్తుందన్నారు. వరి, చెరుకు మినహా.. కాఫీ, కోక్, శాండల్వుడ్, టేక్ సహా ఇతర అన్ని పంటలను ఆయిల్పామ్ సాగులో అంతరపంటలుగా సాగు చేయవచ్చని మంత్రి తెలిపారు. వరి పంటలు ఎకరానికి అందించే నీటితో మైక్రో ఇరిగేషన్ పద్ధతి ద్వారా కనీసం ఐదెకరాల్లో పామాయిల్ సాకు చేయవచ్చన్నారు. చీడపీడలు, దొంగతనం, అడవి జంతువులు, కోతుల బెడద వంటివి ఈ పంటకు ఉండవన్నారు. దిగుమతులను తగ్గించేందుకు దేశంలోనే ఆయిల్పామ్ పంటను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు మూడు రోజుల్లో భూమి పూజ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ రైతులు తమకు ఎరువుల రాయితీ నిధులు, ఈజీఎస్ డబ్బులు పడలేదని చెప్పడంతో మంత్రి హరీశ్రావు ఉద్యానవన కమిషనర్ వెంకట్రామ్రెడ్డి, పంచాయితీరాజ్ కమిషనర్ శరత్తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల్లో నిధులు జమయ్యేలా చూస్తామని మంత్రి తెలిపారు. తనకు ఇష్టమైన ఆయిల్పామ్ పంట సాగులో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఈవోలు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోనని వెంటనే చర్యలు తప్పవని హెచ్చరించారు. 11 మంది ఆయిల్పామ్ ఫీల్డ్ అసిస్టెంట్లు 50 మందికి ఒకరి చొప్పున వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఆయిల్పామ్ పంట విస్తీర్ణం పెరిగేలా రైతులను చైతన్యం చేయాలన్నారు. అంతకుముందు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆయిల్పామ్ సాగు మెలకువలు రైతులకు వివరించారు. సమావేశంలో ఉద్యానవన అధికారి రామలక్ష్మి పాల్గొన్నారు.