తిరువనంతపురం: మెడికల్ ఎంట్రెన్స్ నీట్ పరీక్ష రాస్తున్న అమ్మాయిలను ఫ్రిస్కింగ్ చేసిన కేసులో కేరళ పోలీసులు అయిదుగురు మహిళల్ని అరెస్టు చేశారు. సెక్యూర్టీ ఏజెన్సీకి చెందిన గీతు, జ్యోత్స్న, బీనాలతో పాటు కాలేజీలోని క్లీనింగ్ సిబ్బందికి చెందిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినిల లోదుస్తుల్ని విప్పించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. బ్రాలు తీసాకే పరీక్ష రాసే అనుమతి ఇచ్చారు. ఈ ఘటనకు చెందిన అయిదు ఫిర్యాదులు నమోదు అయ్యాయి. కొల్లాంలోని మార్థమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉన్న సీసీటీవీ ఫూటేజ్ను పోలీసులు తనిఖీ చేశారు. అయితే మహిళా విద్యార్థినిలను నలుగురు సిబ్బంది ఫ్రిస్కింగ్ చేసినట్లు గుర్తించారు.
మెటల్ హుక్స్ ఉన్న బ్రాలను తీసివేయాలని ఫ్రిస్కింగ్ సిబ్బంది వత్తిడి చేశారు. దీంతో ఓ 17 ఏళ్ల అమ్మాయి బ్రా లేకుండానే 3 గంటల పాటు పరీక్ష రాసింది. అయితే ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీట్ ఇచ్చిన డ్రెస్కోడ్ ప్రకారమే తన కూతురు డ్రెస్సు వేసుకుందని, ఇన్నర్వియర్ డ్రెస్సుల గురించి నీట్లో ఎటువంటి కోడ్లేదని ఆ తండ్రి తన ఫిర్యాదులో తెలిపాడు. ఆ తర్వాత కొంద మంది విద్యార్థినిలు కూడా ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విచారణకు ఆదేశించారు.