ధర్పల్లి, నవంబర్ 24 : మండలంలోని కోటాన్పల్లి గ్రామంలో ఈ నెల 22న జరిగిన ఉల్లెంగుల శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వారిని బుధవారం కోర్టుకు రిమాండ్ చేశామని నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. శ్రీనివాస్ హత్య కేసులో మృతుడి భార్య లక్ష్మి, కుమారుడు శ్రీకాంత్, లక్ష్మి అన్న గంగాధర్తోపాటు వీరికి సహకరించిన కడెం శివప్రసాద్, పాషాను కామారెడ్డి జిల్లాలోని మద్దుల్ క్రాసింగ్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారని, హత్యకు వినియోగించిన వస్తువులను సీజ్ చేశామని వివరించారు. విలేకరుల సమావేశంలో ధర్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై మురళి పాల్గొన్నారు.