Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్లో దారుణం జరిగింది. అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్లో ఉంటున్న యువకుడికి కొంతమంది దుండుగులు కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు కులాంతర ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ కొంతకాలం కిందట ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఓ హాస్టల్లో ఉంటూ శ్రీ సినోమా హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే అతను తన గ్రామానికే చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడు. వారి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మూడేళ్ల క్రితం ఆమెను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహమైనప్పటి నుంచి ఆమెకు భర్తతో తరచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
అయితే తన కూతురి విడాకులకు భాస్కర్ కారణమని ఆమె తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. గతంలో భాస్కర్ను చంపుతామంటూ అమ్మాయి తండ్రి, కుటుంబసభ్యులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం అయ్యప్ప సొసైటీలో భాస్కర్ ఉంటున్న హాస్టల్కు ఐదుగురు వ్యక్తులు వచ్చారు. అనంతరం భాస్కర్కు కాల్ చేసి మాట్లాడుదామని కిందకు పిలిచి కర్రలతో దాడి చేశారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచి ప్రాణాలు తీశారు.
కాగా, తన తమ్ముడిని సదరు అమ్మాయి కుటుంబసభ్యులే హత్య చేశారని భాస్కర్ సోదరుడు చిన్నపల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్య అనంతరం నిందితులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.