ఏథెన్స్ : గ్రీస్లో అగ్నిమాపక విభాగానికి చెందిన విమానం ఆదివారం కూలిపోయింది. అయితే, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక దళం తెలిపింది. పశ్చిమ గ్రీస్లోని అయోనియన్ ద్వీపం జాకింతోస్లో మంటలను అదుపుచేసే సమయంలో పెజెటెల్ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా ఉన్నాడని.. ఇతర అగ్నిమాపక సిబ్బంది సహాయం అందించారని పేర్కొంది. అగ్నిమాపక సిబ్బంది ఆదివారం గ్రీకు ద్వీపమైన ఎవియాలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. వందలాది మంది ప్రజలు తమ తమ నివాసాలను వదిలి వెళ్లారు.
గ్రీస్, టర్కీ దాదాపు రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలతో అల్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్లో ఇద్దరు.. టర్కీలో ఎనిమిది మంది మరణించారు. డజన్ల కొద్దీ జనం ఆసుపత్రి పాలయ్యారు. వారాంతంలో వర్షం కురవడంతో టర్కీలో వేడి నుంచి కొంత ఉపశమనం లభించినా.. గ్రీస్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని పౌర రక్షణ ఉప మంత్రి నికోస్ హర్దాలియాస్ తెలిపారు.