కాలి బూడిదైన రికార్డులు.. మానవపాడులో ఘటన
మానవపాడు, అక్టోబర్ 25: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రికార్డులన్నీ కాలిబూడిదయ్యాయి. ఉదయం 9:30గంటల ప్రాంతం లో తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్ఏలు గోపాల్, పార్వతమ్మ ఉన్నారు. రికార్డు గది నుంచి పొగలు రావడాన్ని గమనించిన వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కంప్యూటర్ ఆపరేటర్ కార్యాలయానికి విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. రికార్డు గదిని తెరిచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే గది మొత్తం మంటలు వ్యాపించాయి. ఫైరింజన్ సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గదిలో రికార్డులన్నీ కాలిపోయాయి. పాత కాస్రా పహాణి, పాత ఆర్వోఆర్ నకళ్లతోపాటు 48 రకాల దస్ర్తాలు మొత్తం బూడిదయ్యాయి. ఘటనా స్థలాన్ని ఆర్డీవో రాములు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీయాలని పోలీసులు ఆదేశించారు.