హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు ఎమ్మార్పీ (గరిష్ఠ ధర) కంటే అధిక ధరకు వస్తువులను విక్రయిస్తున్న స్టాళ్ల నిర్వాహకులపై అధికారులు శనివారం కొరడా ఝళిపించారు. కొందరికి భారీ జరిమానా విధించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ‘బస్టాండ్లలోని స్టాళ్ల యజమానులను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారు. వారిపై మా బృందాలు చర్యలకు దిగి జరిమానా విధిస్తున్నాయి. అధిక ధరలను నియంత్రించేందుకు ప్రయాణికులు ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయాలి. స్టాళ్ల యజమానుల అక్రమాలపై సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు’ అని సజ్జనార్ పేర్కొన్నారు.