‘ముగిసిన ఆర్థిక సంవత్సరం గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా వార్షిక వృద్ధిని సాధించాం. డిజిటల్ ప్రయాణాల్ని విజయవంతంగా నిర్వహిస్తామన్న అపారమైన విశ్వాసం క్లయింట్లకు మాపై ఉంది. దీనితో మేము మార్కెట్ వాటాను పెంచుకుంటూపోతున్నాం’
-సలీల్ పరేఖ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశంలో రెండో అతి పెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయింది. 2022 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 12 శాతం వృద్ధిచెంది రూ.5,686 కోట్లకు చేరింది. మెజారిటీ బ్రోకింగ్ సంస్థలు రూ. 5,850-6,000 కోట్ల నికరలాభాన్ని ఆర్జిస్తుందని అంచనా వేశారు. 2021 మార్చి క్వార్టర్లో సంస్థ లాభం రూ. 5,076 కోట్లుగా ఉంది. అలాగే అంతక్రితం త్రైమాసికం 2021 అక్టోబర్-డిసెంబర్లో ఆర్జించిన రూ.5,809 కోట్లకంటే తక్కువ లాభాన్ని తాజా క్వార్టర్లో సంపాదించింది. ఇక ఈ మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ ఆదాయం 22.7 శాతం వృద్ధిచెంది రూ. 26,311 కోట్ల నుంచి రూ. 32,276 కోట్లకు పెరిగింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి తమ ఆదాయ వృద్ధి 13-15 శాతం మధ్య ఉంటుందని ఇన్ఫీ గైడెన్స్ ప్రకటించింది.
ఒక వైపు వలసలు అధికంకావడం, మరోవైపు ఐటీ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 85,000 మంది ఫ్రెషర్స్ను ఇన్ఫోసిస్ నియమించుకుంది. 55,000 ఫ్రెషర్లను తీసుకోవాలని గతంలో భావించినప్పటికీ, సర్వీసులకున్న పటిష్ఠమైన డిమాండ్ రీత్యా ఈ నియామకాల్ని 85 వేలకు పెంచినట్టు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ రాయ్ మీడియాకు తెలిపారు. అలాగే ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి 50,000 మందికిపైగా ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించారు. ఈ ఏప్రిల్ నెల నుంచి వేతనాల పెంపును ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు ఇన్ఫీ నుంచి వలస వెళుతున్న ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 25.5 శాతంగా ఉన్న వలసల రేటు మార్చి క్వార్టర్లో 27.7 శాతానికి పెరిగింది.