తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం అంతిమ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య సాగింది. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనంలో బయల్దేరిన ఆమె పార్థివదేహం చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి మీదుగా నల్లగొండకు చేరింది. దారిపొడవునా అభిమానులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి జోహార్లర్పించారు. నల్లగొండ పట్టణంలో సుమారు రెండున్నర గంటలపాటు సాగిన అంతిమయాత్రకు తెలుగు రాష్ర్టాల నుంచి ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చి నివాళులర్పించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎంపీ బడుగులతోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిథులు సీపీఎం నాయకులు పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యంతో ఉన్న సాన్నిహిత్యాన్ని, పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు. అనంతరం మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు నల్లగొండమెడికల్ కళాశాలకు అప్పగించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా కాలినడకన మెడికల్ కళాశాల వరకు వెళ్లారు.
నీలగిరి, మార్చి 20: ఉద్యమాల దివిటి..మూడు తరాల ప్రజా ఉద్యమాలకు నిలువెత్తు సాక్ష్యం..తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం అంతిమ వీడ్కోలు అశేష జనవాహిని నడుమ ఆదివారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మల్లు స్వరాజ్యాన్ని కడసారి చూసేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆమె శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి నల్లగొండకు మల్లు స్వరాజ్యం పార్థివ దేహం ఉదయం 10 గంటలకు బయల్దేరగా చౌటుప్పల్లో ఉమ్మడి జిల్లా నాయకులు ఎర్రజెండాలు చేత బట్టి మల్లు స్వరాజ్యం అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. చౌటుప్పల్ నుంచి రెడ్డిబావిగూడెం, గుండ్రాంపల్లి, వెల్మినేడు, చిట్యాల, వట్టిమర్తి, నార్కట్పల్లి, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమె పార్థ్ధివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా నాయకత్వం మర్రిగూడ బైపాస్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు నంద్యాల నర్సింహారెడ్డి, బి.వెంకట్, ఎస్.వీరయ్య తదితరులు మల్లు మృతదేహాన్ని తీసుకవస్తున్న అంబులెన్స్తో సుమారు నాలుగు కిలోమీటర్లు పటాకులు కాలుస్తూ.. ఆమె రాసిన పాటలను గుర్తు చేస్తూ కోలాటంతో పార్టీ శ్రేణులు నివాళులర్పించాయి.
మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు అందచేశారు. నా ఊపిరి పోయినా నా శరీరం వృథా కావద్దని తన పార్థ్ధివ దేహాన్ని మెడికల్ విద్యార్థ్దులకు ఉపయోగ పడేందుకు అందజేయాలని ఆమె ఇటీవల కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులకు సూచించింది. దాంతోమెడికల్ కళాశాలకు మల్లు స్వరాజ్యం పార్థ్ధ్దివ దేహాన్ని అందచేశారు. కాగా నల్లగొండలో మెడికల్ కళాశాల ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రెండు పార్థ్ధ్దివ దేహాలు విద్యార్థ్దుల పరీక్షల నిమిత్తం అందజేయబడ్డాయి. ఇటీవల సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి తండ్రి లింగారెడ్డి పార్థివ దేహాన్ని ఇవ్వగా ప్రస్తుతం మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని అందజేశారు.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం పోరాటం ఎంతో కీర్తించదగినదని ఆమె పోరాటం ఎల్లప్పుడు చరిత్రలో నిలిచి పోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మల్లు స్వరాజ్యం పార్థ్థివ దేహానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన వ్యక్తి స్వరాజ్యమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక వీర వనితను కోల్పోయిదని గుత్తా అన్నారు.
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండలోని సీపీఎం కేంద్ర కార్యాలయంలో మల్లు స్వరాజ్యం పార్థ్ధివ దేహానికి మంత్రి జగదీశ్రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై ఆమె స్పందించి ఉద్యమ బాట పట్టిందన్నారు. నా చిన్న నాటి నుంచి మల్లు స్వరాజ్యం ధైర్య సాహసాలు తెలుసుకున్నానన్నారు. ఆమె ఆత్మ విశ్వాసం ముందు ఏ రకమైన ఆయుధాలు పని చేయలేక పోయాయని మంత్రి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు ఆమె పోరాట పటిమ నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు.
మల్లు స్వరాజ్యం పార్థ్ధివ దేహాన్ని ఉభయ రాష్ర్టాల సీపీఎం నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు వేల సంఖ్యలో హాజరై నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్ కుమార్, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వేముల వీరేశం, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సుభాషిణి అలీ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, శ్రీనివాస్రావు, కేంద్ర కమిటీ సభ్యులు మధు, రాష్ట్ర క్యార్యదర్శి వర్గ సభ్యులు సీతారాములు, ఉపాద్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జూలకంటి రంగా రెడ్డి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి, ఏపీ ఐద్వా కార్యదర్శి రమాదేవి, సీపీఐ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్య పద్మ, నంద్యాల నర్సింహారెడ్డి, ముది రెడ్డి సుధాకర్ రెడ్డి, జహంగీర్, మల్లు గౌతం రెడ్డి, చెరుకు సుధాకర్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, సీపీఐ నేతలు మల్లెపల్లి ఆదిరెడ్డి, నెల్లికంటి సత్యం, న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు జనార్దన్, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, దుబ్బాక నర్సింహారెడ్డి, మాలె శరణ్యారెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మల్లు స్వరాజ్యం భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించే ముందు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్వరాజ్యం కుమారులు మల్లు గౌతం రెడ్డి, నాగార్జున్రెడ్డి, కూతురు పాదూరి కరుణ, కోడలు మల్లు లక్ష్మి, మనువల్లు, మనవరాండ్లు తమ కంట నీరును ఆపుకోలేక పోయారు. కోడలు లక్ష్మి చివరగా పార్థ్ధ్దివ దేహంపై పడి ఏడువడంతో పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మల్లు స్వరాజ్యం నిత్యం ప్రజా సమస్యలపైనే దృష్టి సారించి పార్టీ కంటే ప్రజల్లోనే ఎక్కువగా ఎదిగిన గొప్ప ఆదర్శ మహిళ. సాయుధ పోరాటంలో ఆమె పాత్ర చరిత్రలో మరిచి పోని ఘటన. ఒంటి నిండా అణువణువునా విప్లవ భావమే ఉంటుంది. అలాంటి వ్యక్తి నేడు లేక పోవడం సమాజానికి తీరని లోటు.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ
మల్లు స్వరాజ్యం సమాజంలో నెలకొన్న సమస్యలపై నిత్యం పోరాటం చేసిన గొప్ప మహిళ. ఆమె ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినా సామాన్య ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు భూస్వామ్య పోరాటాలకు సైతం నాయకత్వం వహించి ఉద్యమాలను విజయవంతం చేశారు
– సుభాషిణి అలీ, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు
సాహసోపేతమైన పోరాటం స్వరాజ్యనిది
మహిళల్లో ఎక్కువ శాతం మందికి సహజంగా భయం ఉంటుంది. మల్లు స్వరాజ్యానికి మాత్రం భయం అనేది ఉండదు. ఎంతో సాహసమైన వీర వనిత ఆమె మహిళలతో పాటు పురుషులకు సైతం ఉద్యమంలో ఆదర్శంగా నిలిచారు. సమాజంలో ఎలా మెలగాలి అనేది ఆమె ఎంతో మందికి కొత్త నిర్వచనాలు తెలియ చేసి ముందుకు నడిపించారు.
– బీవీ రాఘవులు, పొలిట్ బ్యూరో సభ్యుడు