వరంగల్/మట్టెవాడ, నవంబర్ 30: సమస్యల పరిష్కారం కోసమే నగర బాటకు శ్రీకారం చుట్టామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి గ్రేటర్ పరిధిలోని 7,8,9,10,11,12 డివిజన్లలో పర్యటించారు. స్థానిక సమస్యలను ఆమె కమిషనర్తో కలిసి పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఉదయం 8 గంటలకు 7వ డివిజన్ పరిధిలోని వెయ్యిస్తంభాల దేవాలయం నుంచి నగర బాటను ప్రారంభించారు. డివిజన్లోని హనుమకొండ చౌరస్తా వరకు డ్రైనేజీని పరిశీలించారు.
కాకాజీ కాలనీలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను మేయర్, కమిషనర్ పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ డివిజన్ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, 8వ డివిజన్ నగరబాటలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. కుమార్పల్లి మార్కెట్ రోడ్డు అభివృద్ధితో పాటు మార్కెట్ వద్ద ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని కార్పొరేటర్ బైరి లక్ష్మీకుమారి కోరారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ, అంతర్గత రోడ్లు నిర్మించి, గుడిబండల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను వేరే ప్రాంతానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, 9వ డివిజన్లోని సమస్యలను మేయర్, కమిషనర్కు కార్పొరేటర్ చీకటి శారద వివరించారు. కాకతీయకాలనీ నుంచి అలంకార్ జంక్షన్ వరకు అసంపూర్తిగా ఉన్న రహదారి పూర్తి చేయాలని కోరారు.
అమృత టాకీస్ వద్ద ఉన్న డ్రైనేజీ పైకప్పు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 10వ డివిజన్ పర్యటనలో కార్పొరేటర్ స్థానిక సమస్యలను మేయర్, అధికారులకు వివరించారు. పద్మాక్ష్మి వద్ద నిర్మిస్తున్న స్మార్ట్ రోడ్డును త్వరగా పూర్తి చేయాలని కోరారు. లెప్రసీ కాలనీలో కమ్యూనిటీ టాయ్లెట్స్ నిర్మించాలని విన్నవించారు. 11వ డివిజన్ పర్యటనలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి స్థానిక సమస్యలను వివరించారు. పోతన అడిటోరియంలో ఏర్పాటు చేసిన మినీ ట్రాన్స్ఫర్ స్టేషన్ను తరలించాలని కోరారు. గుడిసె కాలనీల్లో అంతర్గత రహదారులు, కమ్యూనిటీ హాల్ నిర్మించాలన్నారు. 12వ డివిజన్ నగర బాటలో డివిజన్ సమస్యలను కార్పొరేటర్ కావేటి కవిత వివరించారు.
కోట చెరువు వద్ద డ్రైనేజీలో నిలిచిన చెత్తను తొలగించాలని, దేశాయిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. మైనార్టీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణం, శ్మశాన వాటికలో కనీస వసతులు కల్పించాలని వివరించారు. ఆరు డివిజన్లలో చేపట్టిన నగర బాట సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, పరిష్కరించేందుకే ప్రతి మంగళవారం నగర బాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ ఎస్ఈ సత్యనారాయణ, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు రవీందర్ యాదవ్, జోనా, డీఎఫ్వో కిశోర్, హార్టికల్చర్ అధికారి ప్రిసిల్లా, ఈఈ శ్రీనివాసరావు, డీసీపీ ప్రకాశ్రెడ్డి, డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.