జూబ్లీహిల్స్, జనవరి 25 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంనగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ మాట్లాడుతూ.. స్వల్ప లక్షణాలున్న వారు విధిగా వైద్య సిబ్బంది ఇస్తున్న మందులు వాడాలని సూచించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లు పూర్తిగా హోమ్ ఐసొలేషన్లో ఉండి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే అందరికీ ప్రమాదమని హెచ్చరించారు.
యూసుఫ్గూడ సర్కిల్లో 50 బృందాలు..
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇంటింటికీ వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో 50 బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. యూసుఫ్గూడ, రహ్మత్నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో 10 బృందాల చొప్పున సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలున్న వారికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. యూసుఫ్గూడ సర్కిల్లో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి సర్వేను పరిశీలించారు. యూసుఫ్గూడలో మంగళవారం 2203 గృహాలలో సర్వే చేపట్టి స్వల్ప లక్షణాలున్న 82 మందికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేశామని అధికారులు తెలిపారు. 32 మందిని వ్యాక్సినేషన్కు తరలించినట్లు తెలిపారు.
బన్సీలాల్పేట్లో ఇంటింటి జ్వర సర్వే
బన్సీలాల్పేట్, జనవరి 25 : బన్సీలాల్పేట్లోని డీ-క్లాస్ ప్రాంతంలో మంగళవారం వైద్య సిబ్బంది జ్వర సర్వేను నిర్వహించారు. బోయిగూడ, పాన్బజార్ ఆరోగ్య కేంద్రాల ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే ద్వారా కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు నమోదు చేసుకున్నారు. జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, మందుల కిట్లను అందజేశారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు బి.జ్ఞాని, డి.అశోక్, ఆశ వర్కర్లు సావిత్రి, విశాలిని, దేవికారాణి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.