చిన్నపిల్లలు తరచూ జ్వరం బారిన పడుతూ ఉంటారు. జ్వరం రావడానికి కారణాలను గతవారం చెప్పుకొన్నాం. అయితే, దానినుంచి బయటపడే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్వరం బారిన పడిన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయంలో పిల్లలకు ఎక్కువ మోతాదులో ద్రవపదార్థాలు, పండ్లరసాలు, కొబ్బరినీళ్లు ఇవ్వాలి. గోరు వెచ్చని నీటిలో (280-300c) ముంచిన తడి వస్త్రంతో శరీరమంతా తల నుంచి కాళ్ల వరకు తుడవాలి.
ముఖ్యంగా మెడ, చంకలు, గజ్జల్లో ఇలా 15-20 నిమిషాలు తుడిస్తే ఆ తర్వాత అరగంటలో శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. జ్వరం వచ్చినప్పుడు కొద్దిరోజులకు ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి, ఈ సమయంలో పిల్లలకు ద్రవపదార్థాలతోపాటు వారికి ఇష్టమైన ఆహారం ఇంట్లోనే తయారు చేసి కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినిపించాలి. తల్లిపాలు తాగే వయసున్న పిల్లలు జ్వరం వచ్చినప్పుడు పాలు తాగడానికి చికాకు పడుతుంటారు. ఇలాంటప్పుడు తల్లిపాలను కప్పులోకి తీసి చెంచాతో తాగించాలి.
సొంతవైద్యం వద్దు
కనీస అవగాహన లేకుండా చేసే సొంత వైద్యం ప్రమాదకరం. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ సొంతంగా అస్సలు ఇవ్వకూడదు. వాటిని వైద్యులు సూచిస్తేనే ఇవ్వాలి. పిల్లలకు ఇచ్చే మందుల మోతాదు వారి బరువుపై ఆధారపడి ఉంటుంది. మోతాదు తక్కువగా ఇస్తే సరిగ్గా పనిచేయకపోవడం, ఎక్కువగా ఇస్తే దుష్ప్రభావాలు కలుగవచ్చు. మరో విషయం ఏంటంటే మార్కెట్లో లభించే జ్వరం మందుల్లో అనేక వ్యత్యాసాలుంటాయి. ఉదాహరణకు 1ml పారాసెటమాల్ చుక్కల మందులో వివిధ కంపెనీల వారు 100, 120, 150 మి.గ్రా. తయారు చేస్తున్నారు. అదే విధంగా 5 మి.లీ. సిరప్లో 124, 125, 240, 250, 500 పారాసెటమాల్ ఉంటుంది. పారాసెటమాల్ మందు పిల్లల బరువులో కిలోకు 10-15 మి.గ్రా. ఇవ్వాలి. మందు వేసిన ప్రతిసారి జ్వరం తగ్గకపోవచ్చు. 104 °F ఉన్న జ్వరం 101°F వరకు వచ్చినా సరిపోతుంది.
నోటిద్వారా మందు తీసుకోనప్పుడు పారాసెటమాల్ రెక్టల్ సపోసిటరీస్ లభిస్తాయి. వీటిని మలద్వారం ద్వారా లోపల పెట్టాలి. మందు ఇచ్చిన అరగంట తర్వాత దాని ప్రభావం మొదలవుతుంది. గంటన్నర నుంచి మూడు గంటలలోపు ఫలితం కనిపిస్తుంది. జ్వరం పూర్తిగా తగ్గకపోయినా, తిరిగి జ్వరం వచ్చినా 4 గంటల తర్వాత రెండో డోసు ఇవ్వవచ్చు. రోజులో నాలుగు డోసులకు మించి ఇవ్వకూడదు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండి, ఎంతకీ తగ్గకపోతే వైద్యుడి సలహా మేరకు ఇబుప్రోఫెన్ అనే మందు తగిన మోతాదులో (10 మి.గ్రా. కిలో బరువుకు) ఇవ్వవచ్చు. అయితే, వైద్యుడిని సంప్రదించడానికి ముందు గంటకోసారి జ్వరం ఎంతుందో డాక్టర్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు