హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 కొత్త వేరియంట్ బీఎఫ్ 7.0తో మనకు భయం లేదని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువేనని చెప్పారు. దేశంలో ఇప్పటికే మెజార్టీ ప్రజలకు వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మనం హెర్డ్ ఇమ్యూనిటీ దశలో ఉన్నామని తెలిపారు. చైనా తరహా పరిస్థితి దేశంలో ఎదురయ్యే అవకాశమే లేదని చెప్పారు. అయితే, అందరూ తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
జీరో కొవిడ్ పాలసీ వల్లే..
చైనా అమలు చేసిన జీరో కొవిడ్ పాలసీ విధానమే ఆ దేశంలో కేసులు మళ్లీ పెరిగేందుకు కారణమని డాక్టర్ వినయ్ అభిప్రాయపడ్డారు. అందరికీ వ్యాక్సినేషన్ అందకపోవడం కూడా తీవ్రత పెరిగేలా చేసిందని చెప్పారు. ఆ దేశం వ్యాక్సినేషన్ ప్రక్రియలో వెనుకబడటమే కొత్త వేరియంట్ వ్యాప్తికి దోహదం చేసిందని తెలిపారు. చైనాలో మెజార్టీ వృద్ధులకు ఒక్క డోస్ టీకా కూడా అందలేదని చెప్పారు. కానీ ఇండియాలో కొవిడ్ ప్రతి వేరియంట్కు తగినట్టు రోగనిరోధక శక్తిని పెంచేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిందని తెలిపారు. వయో పరిమితి లేకుండా అందరూ టీకాలు తీసుకోవడంతో తాజా వేరియంట్ ప్రభావం దేశంలో తక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.