శిశువు జబ్బు పడినప్పుడు, పెరుగుదలలో లోపం రాకుండా జాగ్రత్తపడటం తల్లిదండ్రుల కర్తవ్యం. అంటువ్యాధులకు ఆహార లోపాలు తోడైతే పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది. అనారోగ్య సమయంలో పసిబిడ్డల ఆకలి బాగా తగ్గిపోతుంది. వాంతులు అవుతాయి. దీనివల్ల తీసుకునే ఆహార పరిమాణమూ తగ్గిపోతుంది.
అతిసార వ్యాధి, మశూచి వచ్చినప్పుడైతే, తీసుకున్న ఆహారంలో కొంత మాత్రమే ఒంటికి పడుతుంది. ఇప్పటికీ కొందరు ‘లంఖణం పరమౌషధం’ అన్న మాటనే నమ్ముతారు. పిల్లలకు ఆహారం ఇవ్వకుండా కడుపు మాడ్చుతారు. నిజానికి ఆరోగ్యవంతులతో పోలిస్తే, అనారోగ్యపీడితుల ఆహార అవసరాలే ఎక్కువగా ఉంటాయి.
వ్యాధిని ఎదిరించడానికి మందులతోపాటు బలవర్ధకమైన ఆహారం అవసరం. అందువల్ల, అనారోగ్య సమయంలో పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం తినిపించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. అందులోనూ, కోలుకుంటున్న దశలో బాగా ఆకలి వేస్తుంది. కాబట్టి, అంతకుముందు కన్నా ఎక్కువ ఆహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాలి.
ఇష్టమైన పదార్థాలను మెత్తగా చేసి, కొద్దికొద్దిగా ఎక్కువసార్లు పెట్టాలి. అందులోనూ తల్లిపాలు చాలా ముఖ్యం. ఈ సమయంలో బిడ్డలు ద్రవ పదార్థాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. బిడ్డ వ్యాధికి పూర్వం ఉన్న బరువుకు తిరిగి చేరుకోగలిగితే, అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నట్టే.
పిల్లలను తరచూ ఇబ్బందిపెట్టే రుగ్మతలు దగ్గు, జలుబు. వీటిని అశ్రద్ధ చేస్తే న్యుమోనియా అనే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీయవచ్చు. తల్లిపాలతో న్యుమోనియాను అరికట్టవచ్చు. విటమిన్-ఎ ఎక్కువగా ఉండే పసుపుపచ్చ ఫలాలు, ఆకుకూరలు కూడా శ్వాసకోశ వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
దగ్గు, జలుబు ఉన్నప్పుడు తల్లిపాలు తాగడం పిల్లలకు కష్టం కావచ్చు. అలా అని ఆపకూడదు. అమ్మ పాలు రోగనిరోధక శక్తిని ఇవ్వడమే కాదు, పోషకాహార లోపాలనూ నివారిస్తాయి. పిల్లల ముక్కును తరచూ శుభ్రం చేయడం వల్ల పాలు తాగడం సులభం అవుతుంది.
అయినా ఇబ్బందిగా ఉంటే, శుభ్రమైన కప్పులోకి పాలు పిండి చెంచాతో తాగించాలి. తరచూ ద్రవ పదార్థాలు ఇవ్వడం వల్ల శ్వాస నాళాలలోని స్రవాలు చిక్కబడవు. దగ్గినప్పుడు సులభంగా బయటికి వచ్చేస్తాయి.
డాక్టర్ కర్రా రమేష్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు