ఐజ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగి దొడ్డి గ్రామ స్టేజీ వద్ద సీడ్ పత్తి రైతులు ( Cotton Seed Farmers ) రాస్తారోకో నిర్వహించారు. సుమారు వెయ్యి మంది రైతులు దాదాపు 5 గంటల పాటు రహదారిపై బైటాయించడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. నడిగడ్డ కుల పోరాట సమితి అధ్యక్షుడు గోంగొళ్ళ రంజిత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చిన్న రాముడు, బీజేపీ నాయకులు రామచంద్రా రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో సీడ్ కంపెనీలు ( Seed Companys) , ఆర్గనైజర్లు ( Organisers ) కుమ్మక్కై రైతులకు మాయ మాటలు చెప్పి విత్తనాలను నాటించారని, విత్తనాలు నాటి సుమారు 50 రోజులు అవుతున్న కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులకు ఏ విషయం విత్తనాల కొనుగోలు ప్రస్తావన తీసుకురాక పోవడంపై మండిపడ్డారు.
ఇప్పటికే ఎకరాకు 50 నుంచి 60 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇందుకు నష్టపరిహారంగా ఎకరాకు లక్ష రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రాసింగ్ పెట్టే సమయంలో మాట మార్చి ఎకరాకు రెండు క్వింటాల్ విత్తనాలు తీసుకుంటామని చెప్పడం సబబు కాదని వాపోయారు. రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
గద్వాల డీఎస్పీ మొగిలయ్య, శాంతినగర్ సీఐ టాటా బాబు, తహసీల్దార్ జ్యోతి, ఎస్సై శ్రీనివాసరావు చేరుకొని రైతులకు నచ్చజెప్పి ప్రయత్నం చేసిన ఫలించలేదు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నాను విరమించేది లేదని రైతులు పట్టు పట్టారు. దీంతో డీఎస్పీ మొగిలయ్య , జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్తో ఫోన్లో సంప్రదించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. రాస్తారోకోలో ఐజ, గట్టు, మల్దకల్, మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.