న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో పలు కీలక ఘటనలు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. దవాఖానల్లో ప్రాణవాయువు కూడా దొరకలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు అలుపెరుగకుండా సాగించిన నిరసనోద్యమం విజయవంతమైంది. గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యుడు లబోదిబోమన్నాడు. ఐదు రాష్ర్టాల ఎన్నికలు, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది.
టీకా వచ్చినా.. విలయం ఆగలేదు
కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో శ్రీకారం చుట్టింది. స్వదేశీ టీకాలైన కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేసి.. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ను ప్రారంభించింది. ప్రారంభంలో వ్యాక్సినేషన్ మందకొడిగా సాగడం, ఐదు రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించకపోవడంతో సెకండ్వేవ్ కోరలు చాచింది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులతో పాటు వేలాది మంది మహమ్మారికి బలయ్యారు. కరోనా మృతులతో మే నెలలో శ్మశానవాటికలు నిండిపోయాయి. దవాఖానాల్లో రోగులకు బెడ్లు, ఆక్సిజన్ కరువయ్యింది.
సాగు చట్టాలు వెనక్కి..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులు.. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అయితే ఇది ఉద్రిక్తంగా మారింది. పోలీసుల బ్యారికేడ్లను ధ్వంసం చేసిన రైతన్నలు చారిత్రక ఎర్రకోటను ముట్టడించారు. ఏడాది చివరి వరకూ అన్నదాతల నిరసనోద్యమం కొనసాగింది. నిరసనల్లో 700 మంది రైతులు అమరులయ్యారు. దీంతో సర్వత్రా ఒత్తిళ్లు రావడంతో.. దిగొచ్చిన కేంద్రం సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోదీనే ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. జాతికి క్షమాపణ చెప్పారు.
లఖింపూర్ హింసాత్మక ఘటన
సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనశ్రేణి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అన్నదాతలు మరణించగా, అనంతరం జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతిచెందారు. మరోవైపు, తీవ్రవాదులుగా పొరబడి భద్రతా దళాలు కాల్పులు జరుపడంతో నాగాలాండ్లో 14 మంది పౌరులు మృతిచెందారు. ఈ రెండు ఘటనలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి.
బీజేపీకి భంగపాటు
ఐదురాష్ర్టాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్లో తృణమూల్, తమిళనాడులో డీఎంకే కూటమి, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి విజయం సాధించాయి. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లోనూ కాషాయపార్టీ చతికిలపడింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి.
పెగాసస్ దుమారం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు పెగాసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇజ్రాయెల్కు చెందిన స్పైవేర్తో దేశంలోని 300 మందికిపైగా ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ, కేంద్రప్రభుత్వం సుంకాలు పెంచడంతో దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యికి, పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. వంద దాటాయి.