ఊరూరా రైతుబంధు వారోత్సవాలు హోరెత్తుతున్నాయి. పంట క్షేత్రాల్లో రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. పొలాల్లో ‘జై కేసీఆర్.. ఇంటింటా రైతుబంధు’ అంటూ వరి నారు, పంట దిగుబడులతో తీర్చిదిద్దుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరోవైపు ఎడ్లబండ్లను అందంగా అలంకరించి సీఎం కేసీఆర్ చిత్రపటాలతో ఊరేగించి, కృతజ్ఞతగా పాలాభిషేకాలు చేస్తున్నారు. మంగళవారం రెండో రోజూ రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. పలు చోట్ల మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టారు.
కరీంనగర్, జనవరి 4(నమస్తే తెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుబంధు వారోత్సవ సంబురాలు రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగాయి. పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్గౌడ్ ఆద్వర్యంలో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఇందులో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా ఎడ్లబండిని నడిపారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఇదే జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ రైతులు పొలంలో వరినారుతో ‘జై కేసీఆర్.. జై రైతుబంధు’ అని రాసి అభిమానం చాటుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం గొడిసెలపేటలో ముస్కు దేవేందర్రెడ్డి అనే రైతు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఇంటి ముందు తనకు పండిన పత్తి, మిర్చి పంటలతో జై తెలంగాణ, రైతుబంధు అని తెలుగులో రాశాడు. జగిత్యాల అర్బన్ మండలంలోని హస్నాబాద్ గ్రామంలో గొల్లపల్లి లక్ష్మణ్ గౌడ్ పొలం వద్ద నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొలంలో వరినారు, బంతి పూలతో ‘కేసీఆర్.. ఇంటింటా రైతుబంధు’ అని అందంగా అలంకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాలలో ఎడ్ల బండిని పూలతో అలంకరించి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలు పెట్టి ర్యాలీ తీశారు. అనంతరం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు రైతువేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతే కాకుండా, ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రైతుబంధు ఏర్పాటు, ఉపయోగాలపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
రెండు బాయిలు తవ్వించిన..
కరువు ఉన్న భూములకు కరువుదీరెటట్టు జేసిండు. రైతు గోస తెలిసెపటికెనే 24 గంటల ఫ్రీ కరెంటిచ్చిండు. ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తండు. గాచారం మంచిగలేక రైతు సచ్చిపోతే బీమాతో ఆదుకుంటండు. నాకున్న ఎనిమిదెకరాలల్ల నాపొంటి నాలుగెకరాలు, కోడలు పొంటి రెండెకరాలు, కొడుకు పొంటి రెండెకరాలు పట్టజేయించిన. ఇంతకు ముందు బాయి తవ్విత్తె నీళ్లే పల్లేదు. ఎనిమిదెకరాలున్నా కరువుతోటి పంటే పండియ్యలె. ఇప్పుడు మూడేండ్ల నుంచి సెరువుల్ల, కుంటల్ల నీళ్లు ఫుల్లుగచ్చినయ్. ఇప్పుడు రైతుబంధు కింద నాకు, నా కొడుకు, కోడలుకు పసలుకు 40 వేలు అత్తున్నై. ఈ పైసలు అచ్చినంకనే రెండుబాయిలు తవ్వించిన. ఫుల్లు నీల్లున్నై. ఎకరంల మిరపతోట, రెండెకరాలల్ల సన్నపువడ్లు పెట్టిన. మా గురించి ఇంతమంచిగ జేసిన ఇగో ఈనే మా దేవుడు..
రైతు బంధు శాన సాయమైతంది..
రైతు బంధు పథకం రైతులకు సాన సాయమైతంది. నాకు ఎకరంన్నర భూమి ఉంది. దానికి రూ.8500 అత్తన్నయ్. భూమి మాది, పెట్టుబడి కేసీఆర్ సార్ ఇత్తండు. ఆ పైసలతోటి కైకిలి, కూలీలు, పిండి బత్తాలకు అక్కరత్తన్నయ్. మాలాంటి చిన్న రైతులకు గా పైసలే బాగ అనిపిత్తయ్. బీమా పథకం కూడా పెట్టిండు. అంతకు ముందు రైతులకు ఏమైనా అయితే పైసా రాకపోయేది. గిప్పుడు రైతు కుటుంబానికి మేము ఉన్నమంటూ సర్కారు నిలబడ్తంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంకనే మంచి మంచి పథకాలు తెచ్చిండు. ప్రాజెక్ట్లు కట్టిండు. నీళ్ల గోస పోయింది. మా నాయినలు ఎద్దులతోటి మోట కొట్టేది, గూడలు ఏసేది. నీళ్లు పారించేందుకు సాన కట్టపడేది. గసొంటిది గిప్పుడు వీజీగా కాల్వ నీళ్లు అచ్చి పొలంల పడుతున్నయ్. చెరువులు, కుంటలు మంచిగ జేప్పిచ్చిర్రు. గందుకే ఎండకాలంల గూడ మస్తు నీళ్లు ఉంటన్నయ్. మాకు ఏ రంది లేదు.
పెట్టుబడికి సరిపోతున్నయ్..
రైతు బంధు పైసలు వచ్చిన్నట్లు ఫోన్కు మేసేజ్ రాగానే ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకున్న. నాకు ఊరిలో ఆరున్నర ఎకరాల భూమి ఉన్నది. ప్రతి పంటకు 35 వేల సొప్పున ఏడాదికి డబ్బు వేలు వస్తున్నయ్. ఈ పైసలు పొలం దున్నేందుకు ట్రాక్టర్ కిరాయి, యూరియా బస్తాలు, కూలీలకు సరిపోతున్నయ్. వచ్చిన డబ్బులు పంట ఖర్చుకు ఉపయోగపడడంతో పంట కోసిన తరువాత వచ్చిన ఆదాయంతో మా కొడుకు చదువుకు అక్కరకొస్తున్నయ్. టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సాగునీరు రావడంతో పోలంతో పాటు మక్కజొన్న, కూరగాయలను సాగుచేస్తున్నం. కేంద్రం ఇచ్చే రెండు వేలు దేనికి సరిపోవడం లేదు. రైతు బాగుపడాలంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ సారే ఉండాలి.
రందివాసింది..
నాకు మూడెకరాల సాగు భూమి ఉంది. గతంలో పెట్టుబడి పైసల్లేక చానా ఇబ్బందులు వడ్డ. ఏనాడైతే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.10వేలు సాయం అందించడం మొదలు పెట్టిన్రో, ఆనాటి నుంచి ఇబ్బందులు తప్పినై. అప్పులు తెచ్చుడు బందైంది. పెట్టుబడి గురించి ఆలోచన చేసే పెద్ద రంది పోయింది. నాకు పసలుకు రూ.15వేలు వస్తున్నయ్. ఆటితోటే విత్తనాలు, మందులు కొంటున్న. ఈ యేడు వానాకాలంలో వరేసిన. ఇప్పుడు ఎకరంన్నలో వరి, మిగతా దాంట్లో యాసంగి పత్తి వెట్టిన. సరారు ఎవుసానికి అన్ని రకాల సౌలతులు చేసింది. ఇయ్యాల ఎవుసం పండుగలా ఉంది.
పెట్టుబడికి అప్పుల బాధ తప్పింది..
నాకు మా ఊరిల ఎకరం భూమి ఉన్నది. ఇంతకుముందు పంటల సాగు సమయంల పెట్టుబడి కోసం మస్తు తిప్పలు పడేటొళ్లం. ఎరువులు, ఇత్తనాలను ఉద్దెరకు తెచ్చేటోళ్లం. పంటలు పండంగనే అమ్మి బాకీలు కట్టేది. ఈ మూడేండ్ల సంది పెట్టుబడికి రందీలేకుండ పోయింది. సర్కారే ఆర్నెళ్లకోసారి ఐదువేల రూపాయలు అందిస్తున్నది. ఈ పైసలతోనే ఎరువులు, ఇత్తనాలు కొంటున్న. రైతులను అన్నివిధాల ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ సారుకు కృతజ్ఞతలు.
ఎవుసమంటేనే ఏడుపొచ్చేది..
పంటల కాలం వచ్చిందంటే పెట్టుబడికి రందిపడేది. ఎట్లెళ్ల దీసుడోనని ఏడుపొచ్చేది. అప్పుల కోసం మిత్తీల వ్యాపారులను బతిమాలేది. వాడు దయుంచి ఇన్ని పైసలు ఇత్తే ఎడ్లను గట్టుకొని పొలంల దిగేది. లేకుంటే భూమిని ఎండబెట్టుకొని కూలికి పోయేది.. తెలంగాణ అచ్చినంక రైతుల బాధలు తీరినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవుసందారులకు ఎంతో మేలు జేత్తుండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాళేశ్వరం కట్టి ఊరూరికి నీళ్లు ఇత్తుండు. ఇప్పుడు ఎన్కటలెక్క ఎక్కడ జూసిన నీళ్లే కనిపిత్తున్నయ్.. రైతుబంధు తెచ్చి అప్పుల బాధ తీర్చిండు.. ఎనిమిదెకరాలు ఉన్న నాకు నిన్ననే 40వేల రూపాయలు ఖాతాల పడ్డయ్. ఈ నాలుగేండ్లల రూ. 3లక్షల దాకా అచ్చినయ్.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగెకరాల్లో పత్తి, మరో నాలుగెకరాల్లో మిర్చి పండిస్త.. సాయం చేసిన కేసీఆర్ సార్కు దండం.