ఆలేరురూరల్, ఏప్రిల్ 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో ఈ మేరకు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో నిల్వలు పెరిగి పోతున్నాయని, అకాల వర్షాలు పడితే ధాన్యం తడిసి తాము నష్టపోయే ప్రమాదం ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత కారణంగా వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు.