ఎంఎస్పీపై ప్రధాని విస్పష్ట ప్రకటన చేయాలి
లక్నో: రైతుల్లో చీలిక తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కనీస మద్దతు ధరలకు (ఎంఎస్పీ) చట్టబద్ధ హామీ ఇవ్వడంపై ప్రధాని మోదీ విస్పష్ట ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఈ డిమాండ్కు మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అన్ని సమస్యలు పరిష్కారమయ్యాకే రైతులు ఇండ్లకు వెళ్తారని స్పష్టంచేశారు. ఎంఎస్పీ అంశంపై సంయుక్త కిసాన్ మోర్చా సోమవారం లక్నోలో నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్లో టికాయిత్ మాట్లాడారు. ‘సాగు చట్టాలు రైతులకు నష్టదాయకమని కేంద్రంలోని పెద్దలకు ఏడాది తర్వాత అర్థమైంది. వాటిని రద్దు చేస్తూ సరైన నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ చట్టాలపై ఓ వర్గం రైతులను ఒప్పించలేకపోయామని చెప్తూ రైతుల్లో చీలక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించాకే సాగుచట్టాల నివేదిక విడుదలపై నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్యానెల్ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు.