జగిత్యాల కలెక్టరేట్, అక్టోబర్ ౨౮: షాపింగ్కు వెళ్లిన ఇద్దరు యువతులు, ఓ బాలిక ధర్మసముద్రం చెరువులో శవమై తేలారు. వీరిలో ఇద్దరికి ఇటీవలే వివాహం కాగా, మరొకరు ఇంటర్ విద్యార్థిని. వీరు వరుసకు అక్కాచెల్లెళ్లు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలోని ఉప్పరిపేటకు చెందిన ఎక్కల్దేవి మల్లిక(౧౯), ఎక్కల్దేవి గంగజల (౧౯), ఎక్కల్దేవి వందన(౧౬) వరుసకు అక్కాచెల్లెళ్లు. మల్లిక, గంగజలకు గత ఆగస్టు నెలలో వివాహాలు జరిగాయి. చందన జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. అత్తాగారిండ్లలో ఉంటున్న మల్లిక, గంగజల ఇటీవల అనారోగ్యం బారినపడ్డారు. దీంతో వారిని తల్లిదండ్రులు వారం క్రితం జగిత్యాలకు తీసుకువచ్చి స్థానిక వైద్యుడికి చూపించారు. ఈ క్రమంలో గంగజల, మల్లిక, వందన షాపింగ్కు వెళ్తున్నామని చెప్పి బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. చీకటిపడ్డా తిరిగిరాలేదు. వారి తల్లిదండ్రులు బంధువుల ఇండ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో గురువారం ఉదయం జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం ధర్మసముద్రం చెరువులో ఇద్దరి మృతదేహాలు తేలడాన్ని చూసిన జగిత్యాల పంప్హౌస్ ఆపరేటర్ పోలీసులకు సమాచారమిచ్చారు. చెరువులో తేలిన మృతదేహాలు మల్లిక, గంగజలవిగా నిర్ధారించారు. అక్కడే గాలించగా కొంతసేపటి తర్వాత వందన మృతదేహం దొరికిం ది. వీరి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మల్లిక, గంగజల అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని, వీరు చెరువులో దూకడాన్ని తట్టుకోలేకే వందన సైతం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారని వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.