వరంగల్, సెప్టెంబర్ 4: ఏసీబీ అధికారినని చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నిందితుడిని వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్స్టేషన్లో మీడియా ముందు చూపి, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్రెడ్డి ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొండ, నల్లబెల్లి మండలాలకు చెందిన భూ సర్వేయర్లు శామ్యూల్, మల్లయ్య, కుశాల్కు ఫోన్ చేసి తాను ఏసీబీ అధికారినని చెప్పుకున్నారు.
భూముల సర్వే విషయంలో రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమకు కైంప్లెంట్ వచ్చిందని బెదిరించాడు. బయటపడాలంటే రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించాలని చెప్పాడు. దీంతో సర్వేయర్లు కుశాల్ రూ.5వేలు, మల్లయ్య రూ.2వేలు అతడి ఖాతాకు ఫోన్పే ద్వారా పంపి నమ్మించే ప్రయత్నించారు. ఆ తర్వాత సర్వేయర్ మల్లయ్య నల్లబెల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై నగేశ్ చాకచక్యంగా వ్యవహరించారు. మిగతా డబ్బులు ఇస్తానంటూ మల్లయ్యతో నిందితుడికి ఫోన్ చేయించారు. దీంతో డబ్బులు తీసుకునేందుకు శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉదయం హనుమకొండ నుంచి బయల్దేరి మండలంలోని శనిగరం క్రాస్రోడ్డు వద్దకు చేరుకోగా, పథకం ప్రకారం అక్కడే తన సిబ్బందితో మఫ్టీలో ఉన్న ఎస్సై అదుపులోకి తీసుకున్నారు.
విచారించగా అతడిపై కరీంనగర్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, విజయవాడ పోలీస్స్టేషన్లలో పలు నేరాల కింద 16 కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని ఈస్ట్జోన్ డీసీపీ అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ తిరుమల్, సీఐ కిషన్, నల్లబెల్లి ఎస్సై నైనాల నగేశ్ పాల్గొన్నారు.