న్యూఢిల్లీ: నకిలీ వార్తలను ప్రచారం చేసే ఖాతాలను తొలగించడంలో ఫేస్బుక్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆ సంస్థ మాజీ ఉద్యోగిని, విజిల్ బ్లోయర్ సోఫి ఝాంగ్ ఆరోపించారు. గతేడాది ఢిల్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో పాటు కాంగ్రెస్, ఆప్కి చెందిన కొందరు నేతలు ఫేస్బుక్లో నకిలీ ఖాతాలను తెరిచి అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన తమ బృందం.. మిగతా పార్టీల నేతలకు చెందిన నకిలీ ఖాతాలను తొలగించామని, అయితే బీజేపీ నేతకు చెందిన ఖాతాను తొలగించడం సాధ్యపడలేదన్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు సమస్యను పలుమార్లు తెలియజేసినప్పటికీ, వారి నుంచి స్పందన లేదన్నారు. లోతుగా విశ్లేషిస్తే, ఆ ఖాతా బీజేపీకి చెందిన ఓ లోక్సభ ఎంపీకి సంబంధించినదిగా గుర్తించినట్టు వెల్లడించారు. ‘దేశంలో శక్తివంతమైన వారికి (బీజేపీ నేతలకు) ఒక రకమైన నిబంధనలు, మిగతావారికి మరోలా నిబంధనలు కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు. బీజేపీ నేతకు చెందినది కాబట్టే, ఆ ఖాతాను నేను తొలగించలేకపోయా’ అని ఝాంగ్ తెలిపారు.