ITR Filing | గత ఆర్థిక సంవత్సర (2021-22) ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి తుది గడువు పొడిగించేది లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ కుండబద్ధలు కొట్టారు. ఈ నెలాఖరుతో ఐటీఆర్ దాఖలు చేయడానికి తుది గడువు. కానీ, ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలన్న యోచన సర్కార్కు లేదని తరుణ్ బజాజ్ శుక్రవారం స్పష్టం చేశారు. కానీ, తరుణ్ బజాజ్ ప్రకటనపై పలువురు పన్ను చెల్లింపుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. తక్షణం గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతటితో ఆగడం లేదు. ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించాలని #Extend_Due_Dates_Immediately అనే హ్యాష్ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ ఎంత ఒత్తిడినైనా తట్టుకుంటుందని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కంప్లయిట్ చేస్తున్నారు. ఐటీఆర్ దాఖలు చేస్తున్నప్పుడు ఆన్లైన్లో తమకు ఎదురైన ఇబ్బందులను స్క్రీన్షాట్ తీసి ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నారు.
కొత్తగా గతేడాది అందుబాటులోకి తెచ్చిన ఆదాయం పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ సరిగా పని చేయట్లేదని ఫిర్యాదుల్లో ఎక్కువ మంది టాక్స్ పేయర్లు పేర్కొంటున్నారు. ఐటీఆర్-3 ఫైలింగ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ యూజర్ పోస్ట్ చేశాడు. సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి కాకపోతే పెనాల్టీ కత్తి తను వెంటాడుతుందని కూడా పేర్కొన్నాడు. తానేం చేయాలని ప్రశ్నించాడు. దానిపై ఐటీ విభాగం స్పందించింది. పాన్, మొబైల్ వివరాలు వివరాలు తమతో పంచుకోవాలని, తమ టీం ఆయనతో టచ్లో ఉంటామని పేర్కొంది. పాన్ తదితర వివరాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల దుర్వినియోగం అవుతాయని తెలిపింది.
పలువురు యూజర్లు ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ https://eportal.incometax.gov.in సరిగ్గా పని చేయడం లేదని, లోడ్ అవుతున్నట్లు చూపుతూనే తర్వాత ఫెయిల్ అని మెసేజ్ వస్తున్నదని ఫిర్యాదు చేశారు. ఉదయం ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ లోడింగ్ నెమ్మదిగా అవుతున్నదని, ఎప్పుడు అది సజావుగా పని చేస్తుందో చెప్పాలని మరో యూజర్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయని, ఈ నేపథ్యంలోనైనా సెప్టెంబర్ నెలాఖరు వరకు కాకపోయినా.. ఆగస్టు వరకైనా పొడిగించాలని యూజర్లు కోరుతున్నారు.
కొత్త ఐటీ పోర్టల్ లోడింగ్ అంటూ వస్తోందని మరో యూజర్ పేర్కొన్నారు. ఓటీపీ వ్యాలిడేటింగ్కు గంట దాటినా ప్రక్రియ పూర్తవ్వలేదని ఇంకో వ్యక్తి పోస్ట్ చేశారు. ఒకవైపు ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్లో పలు సమస్యలు తలెత్తుతూ ఉంటే, గడువు పొడిగించబోమని చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువును కేంద్రం పొడిగించింది.
యూజర్ల ఫిర్యాదులపై ఐటీ విభాగం శనివారం రియాక్టయింది. `ప్రియమైన పన్ను చెల్లింపుదారుల్లారా..! మీరు మీ ఐటీఆర్ ఫైల్ చేయడం మరిచిపోవద్దు. ఒకవేళ మీరు ఫైల్ చేయకుంటే గత ఆర్థిక సంవత్సర ఐటీఆర్ ఫైలింగ్ చివరి తేది 2022 జూలై 31` అని గుర్తు చేసింది. వేతన జీవులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్యూఎఫ్) ఈ నెలాఖరులోగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.