హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఎగుమతులు 400 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని కేంద్ర వాణిజ్యశాఖ సంయుక్త కార్యదర్శి శ్రీకర్ కే రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో బుధవారం ఫెడరేషన్ భవన్లో ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. మన దేశానికి యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని, 2019-20లో ఇరు దేశాల మధ్య 59 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగినట్లు పేర్కొన్నారు. 2019-20లో యూఏఈకి 2,932.34 మిలియన్ డాలర్ల మేర దేశీయ ఎగుమతులు జరుగగా…ఇదే సమయంలో 6,086.40 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతిచేసుకున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఇది భారత్ ఎగుమతులకు అతిపెద్ద గమ్యస్థానమని, 2019-20లో 29 బిలియన్ల ఎగుమతులు జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.