400 బిలియన్ డాలర్లు దాటిన ఎక్స్పోర్ట్
న్యూఢిల్లీ, మార్చి 23: దేశీయ ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఒకే ఏడాది ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరగడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ, కెమికల్స్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ఈ నెల 21 వరకు దేశీయ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 37 శాతం ఎగబాకి 400.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. సరాసరిగా రోజుకు ఒక్క బిలియన్ డాలర్లు లేదా నెలకు 33 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయన్న మాట. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 292 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇప్పటి వరకు గరిష్ఠ స్థాయిలో ఉన్న 2018-19లో జరిగిన 330.07 బిలియన్ డాలర్ల ఎగుమతులు దీంతో తుడిచి పెట్టుకుపోయాయి. ఇదే సమయంలో భారత్ 589 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 189 బిలియన్ డాలర్లుగా ఉన్నది. కరోనా, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఎగుమతులు మరో మైలురాయికి చేరుకోవడం విశేషమని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.