భోపాల్ : మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో టైమర్ బాంబుతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని రాసి ఉంచిన లేఖ లభ్యమైంది. రేవా జిల్లాలోని జాతీయ రహదారి-30పై ఓ బ్రిడ్జి కింద టైమర్ బాంబును అమర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం టైమర్ బాంబును నిర్వీర్యం చేశారు. అక్కడే ఉన్న లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి ఘటన రేవా జిల్లాలో చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. టైమర్ బాంబును ఎవరు అమర్చారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వచ్చే నెలలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో యూపీ ఎన్నికలు జరగనున్నాయి.